సింగరేణి సమర్పించు.. సోలార్‌ పవర్​

సింగరేణి సమర్పించు..  సోలార్‌ పవర్​

    ఎస్టీపీపీ ఆవరణలో రెండు యూనిట్ల నిర్మాణం పూర్తి

    నెల వ్యవధిలో 10 మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి

    థర్మల్‌, సోలార్ పవర్ ప్రొడక్షన్‌తో సంస్థ రికార్డు

    ఇంజినీర్లు, ఆఫీసర్లకు సీఎండీ శ్రీధర్ అభినందనలు

    ఆగస్టు కల్లా 220 మెగావాట్ల సోలార్ పవర్ లక్ష్యం

బొగ్గు తవ్వకాలు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసిన సింగరేణి.. తాజాగా సోలార్ పవర్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టింది. కోల్‌బెల్ట్‌ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు నాటికి 220 మెగావాట్ల సౌరవిద్యుత్​ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్​లోని ఎస్టీపీపీ  (సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​) ఆవరణలో నెలకొల్పిన10 మెగావాట్ల ప్లాంటు ద్వారా సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఐదు మెగావాట్ల కెపాసిటీ గల రెండు ప్లాంట్లను సింక్రనైజేషన్ చేయడం ద్వారా దేశంలోనే థర్మల్‌, సోలార్ పవర్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టిన ఏకైక బొగ్గు సంస్థగా సింగరేణి అవతరించింది.

సోలార్ పవర్ ఉత్పత్తిలో ముందడుగు

సోలార్​ పవర్​వైపు అడుగులు వేయాలనే నిర్ణయం మేరకు జైపూర్‌లోని సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్ఆవరణలో తొలిదశ సోలార్​పవర్​ఉత్పత్తి కోసం10 మెగావాట్ల కెపాసిటీ గల రెండు యూనిట్ల నిర్మాణ పనులను అధికారులు నాలుగు నెలల్లో పూర్తి చేశారు. గత నెల 10న ఐదు మెగావాట్ల సోలార్ పవర్​ ప్లాంట్ సింక్రనైజేషన్ చేశారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే మరో 5 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిని ప్రారంభించి సత్తా
చాటారు.

శ్రీరాంపూర్ బొగ్గు గనులకు సరఫరా

ఎస్టీపీపీ ఆవరణలో తొలివిడత అందుబాటులోకి వచ్చిన 5 మెగావాట్ల సోలార్ పవర్‌ను గత నెల10 నుంచి 33 కేవీ లైన్ల ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 లక్షల యూనిట్ల సోలార్ పవర్‌ను బొగ్గు గనులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు.  తాజాగా సోమవారం మరో 5 మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి రావడంతో 33 కేవీ లైనుకు కలిపారు.  ఫలితంగా లక్ష్యానికి అనుగుణంగా10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిని సింగరేణి రీచ్ అయింది. మొత్తం 50 ఎకరాల ఏరియాలో 33,360 మోడ్యూల్స్ (సోలార్ పలకాలు) ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. రెండో దశ 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ యూనిట్ సింక్రనైజేషన్ కార్యక్రమంలో సింగరేణి థర్మల్ విద్యుత్‌ కేంద్రం ఇన్‌చార్జి జీఎం మదన్‌​మోహన్‌, తెలంగాణ విద్యుత్ సంస్థ మంచిర్యాల ఎస్ఈలు సుధీర్‌, రమేశ్​బాబు (ఎన్పీడీసీఎల్), చీఫ్ కో ఆర్డినేటర్ (సింగరేణి సోలార్ పవర్) మురళీధరన్​, డీజీఎం శ్రీనివాస్​రావు, బీహెచ్‌ఈఎల్ ఏజీఎం సుభాశ్‌, పర్సనల్ మేనేజర్ అరవింద్​రావు పాల్గొన్నారు.

సింగరేణి సీఎండీ అభినందనలు

జైపూర్ ఎస్టీపీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన 10 మెగావాట్ల పవర్​ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన నేపథ్యంలో ఇంజినీర్లు, ఆఫీసర్లు, సిబ్బందికి సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మణుగురు, ఇల్లందు, రామగుండంలోని ప్లాంట్ల నిర్మాణాలనూ పూర్తి చేసి పవర్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ ఆగస్టు కల్లా సింగరేణి నుంచి 220 మెగావాట్ల సోలార్ పవర్‌ను​ఉత్పత్తి చేయాలని లక్ష్యంగాపెట్టుకున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి