తన సెల్​ఫోన్ ​అడిగిన తండ్రి హత్య చేసిన కొడుకు 

తన సెల్​ఫోన్ ​అడిగిన తండ్రి హత్య చేసిన కొడుకు 
  •    మంచిర్యాల జిల్లాలో ఘటన 

కోల్​బెల్ట్, వెలుగు : తన సెల్​ఫోన్​ తిరిగిమ్మన్నందుకు ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి కథనం ప్రకారం..సింగరేణి రిటైర్డ్​కార్మికుడు బామండ్లపెల్లి రాయమల్లు(60) మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని అల్లూరి సీతారామరాజునగర్ లో ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మీనమ్మ ముగ్గురు పిల్లలతో గుడిపేటలో ఉంటోంది. చిన్న భార్య రాజేశ్వరి, కొడుకు రాకేశ్​, కోడలు అంజలితో కలిసి రాయమల్లుతో ఉంటున్నారు. కూలీ పనిచేసే రాకేశ్​మద్యానికి బానిసై తరచూ కుటుంబసభ్యులతో గొడవపడుతున్నాడు.

ఈ మధ్య రాకేశ్​తన సెల్​ఫోన్​పోగొట్టుకొని తండ్రి రాయమల్లు సెల్​ఫోన్​వాడుతున్నాడు. గురువారం రాత్రి తన ఫోన్​తనకు ఇచ్చేయాలని రాయమల్లు కొడుకుతో గొడవపడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రాకేశ్​ఇంట్లో ఉన్న రోకలిదుడ్డుతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాకేశ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ శశీధర్​రెడ్డి, టౌన్​ ఎస్సై రాజశేఖర్​ తెలిపారు.