
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో అమానవీయం
పిట్లం, వెలుగు : అనారోగ్యంతో ఉన్న తల్లిని సాదలేక నదిలోకి తోసేసి చంపేశాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం జిల్లా పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లక్పల్లి శివారులోని మంజీరా నదిలో ఈ నెల 11న ఓ వృద్ధురాలి డెడ్బాడీ కనిపించింది. విలేజ్ సెక్రటరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతురాలు బొర్లం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయవ్వ (77)గా గుర్తించారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా.. వృద్ధురాలి కొడుకు ఎర్రోళ్ల బాలయ్యే అదే గ్రామానికి చెందిన మరో బాలుడితో కలిసి తల్లిని చంపినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనారోగ్యంతో మంచాన పడిన సాయవ్వను సాదలేకే చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 8న రాత్రి హాస్పిటల్కు తీసుకెళ్తానని సాయవ్వకు చెప్పి ఆమెతో పాటు మరో బాలుడితో బైక్పై బయలుదేరాడు. బొల్లక్పల్లి శివారులోని మంజీరా బ్రిడ్జి వద్దకు రాగానే సాయవ్వను నదిలోకి తోసేశాడని తెలిపారు. బాలయ్యను రిమాండ్కు తరలించి, బాలుడిని జువైనల్ హోం తరలించామని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావును ఎస్పీ అభినందించారు.