
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ మిస్టరీ వీడింది. మధ్యప్రదేశ్కు చెందిన రఘువంశీని అతడి భార్య సోనమే హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కిరాయి గుండాలతో భర్తను చంపించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తులో గంట గంటకో కొత్త విషయం బయటపడుతోంది. ఈ క్రమంలో అసలు సోనమ్, కుష్వాహా ఎలా కలిశారు..? వీరిద్దరి మధ్య సంబంధం ఎంతకాలం కొనసాగింది..? రాజా రఘువంశీతో సోనమ్ వివాహం ఎలా ఫిక్స్ అయింది..? రాజా హత్యకు ఎలా ప్లాన్ చేశారు..? అన్న విషయాలను పోలీసులు క్రాక్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2023లో సోనమ్, రాజ్ కుశ్వాహాకు పరిచయం ఏర్పడింది. సోనమ్ తండ్రి దేవి సింగ్ ప్లైవుడ్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. దీని వార్షిక టర్నోవర్ రూ. 12-15 కోట్లు. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఆయన కుమారుడు గోవింద్ చూసుకుంటున్నాడు. తండ్రి వ్యాపారంలో సోనమ్ హెచ్ఆర్ బాధ్యతలు చూసుకునేది. సోనమ్ తండ్రి కంపెనీలో కుష్వాహా బిల్లింగ్ విభాగంలో నెలకు రూ.20 వేల జీతంతో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్తా చివరకు ప్రేమగా మారింది.
సోనమ్ కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడైన కుష్వాహా సహోద్యోగులకు, సోనమ్ కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా అందరి ముందు ఆమెను దీదీ అని పిలిచేవాడు. ఇదిలా ఉండగానే సోనమ్కు ఆమె కుటుంబ సభ్యులు 2025 మే 11న రాజా రఘువంశీతో వివాహం చేశారు. అయిష్టంగానే సోనమ్ ఈ పెళ్లి చేసుకుంది. ఎలాగైనా భర్తను అంతమొందించి ప్రియుడుతో కలిసి ఉండాలని ప్లాన్ చేసింది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు పెళ్లైన మూడు రోజుల నుంచే ప్రియుడుతో కలిసి పథకం రచించింది. వ్యూహాంలో భాగంగానే భర్తను షిల్లాంగ్కు హనీమూన్ వెళ్దామని బలవంతం చేసింది.
తనకు మృత్యు శాసనం రాసిపెట్టిందని తెలియని రాజా.. భార్య కోరిక మేరకు షిల్లాంగ్కు హనీమూన్కు వెళ్లాడు. అప్పటికే ప్రిప్లాన్డ్గా ఉన్న సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా షిల్లాంగ్లో రఘు వంశీని హత్య చేసి పారిపోయారు. ఎవరో తన భర్తను హత్య చేసి తనను కిడ్నాప్ చేశారని సోనమ్ నాటకమాడింది. పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది.
కానీ షిల్లాంగ్లో సోనమ్, రాజా రఘువంశీకి టూరిస్ట్ గైడ్ ఉన్న పిడే అనే వ్యక్తి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. సోనమ్, రఘు వంశీతో పాటు హిందీ మాట్లాడే మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పిడే పోలీసులకు చెప్పాడు. దీంతో తమదైన శైలీలో విచారణ చేపట్టిన పోలీసులు.. సోనమ్ ఆమె ప్రియుడుతో కలిసి కిరాయి గుండాలతో రాజాను హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులు సోనమ్, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.