తెలంగాణలో దొరల పాలన పోవాలి : సోనియా గాంధీ

తెలంగాణలో దొరల పాలన పోవాలి : సోనియా గాంధీ

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం ఆమె రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. అయినా మీరంతా నా గుండెల్లోనే ఉంటారు. ఈ రోజు మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరులు, ప్రజల కలలు సాకారం కావడం చూడాలనుకుంటున్నా.

దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మనందరం కలిసి మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ‘సోనియమ్మా’ అని పిలిచి నాకు ఎనలేని గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలందరికీ నాది ఒకటే విన్నపం. అందరూ కలిసి రాష్ట్రంలో ఓ మంచి మార్పును తీసుకురావాలి. మార్పు కోసం కాంగ్రెస్​కు ఓటేయండి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’’ అని చెప్పారు.