- ఎంత ఖర్చయినా భరిస్తానని పేరెంట్స్ కు భరోసా
- కరీంనగర్లోని హాస్పిటల్లో కోలుకుంటున్న బాబు
మంచిర్యాల, వెలుగు: కూలీలు, కార్మికులు, నిరుపేదలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ అండగా నిలుస్తున్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నెలలు నిండకముందే.. కేవలం 900 గ్రాముల బరువుతోనే, స్టమక్ ఇన్ఫెక్షన్తో పుట్టిన చిన్నారి ట్రీట్మెంట్కు రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంకా ఎంత ఖర్చు అయినా భరిస్తానంటూ ఆ బాబు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట కొడుకు పుట్టాడు. నెలలు నిండకముందే కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ జరిగింది. బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు తేల్చారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. మహేశ్చేతిలో పైసలు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు.
కోలుకుంటున్న చిన్నారి..
కరీంనగర్లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి హాస్పిటల్ బిల్లు కట్టారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు. ఇప్పటివరకు కరీంనగర్, హైదరాబాద్లో కలిపి రూ.13 లక్షలు ఖర్చయిందని మహేశ్ తెలిపాడు. తాను 14 ఏండ్లుగా కరీంనగర్లో ఉంటూ మార్బుల్ వర్క్ చేస్తున్నానని చెప్పాడు. సోనూసూద్ ఇప్పటికే రెండుసార్లు తన ఫ్రెండ్కు ఫోన్ చేసి బాబు పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడని చెప్పారు.