
‘‘నేను గెలవడానికి తొలి కారణం మోడీనే. ఆయనపై ప్రజల నమ్మకం.. కార్యకర్తల కృషి వల్లే నా గెలుపు సాధ్యమైంది. సిట్టింగ్ ఎంపీ కవితపై పోటీ టఫ్ టాస్క్ అనుకోలేదు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ప్రజల్లోకి వెళ్తాం. పసుపుకు మద్దతు ధర ఈ ఏడాది నుంచే మొదలవుతుంది. తర్వాతి పంట నుంచే అందుతుంది. గల్ఫ్ వెళ్లే వాళ్లను మోసగిస్తున్న దొంగ ఏజెంట్ల పనిబట్టేందుకు కాల్ సెంటర్ పెడ్తున్నా. దాని పని కూడా మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ‘వీ6 వెలుగు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయం చెప్పారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతామని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ప్రజల్లోకి వెళ్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. పసుపుకు మద్దతు ధర ఈ ఏడాది నుంచే మొదలవుతుందని చెప్పారు. శనివారం ‘వీ6 వెలుగు’కు అర్వింద్ ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు..
కవితపై పోటీ టఫ్ టాస్క్ అనుకోలేదా?
అనుకోలేదు. ప్రధాని మోడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా ఉంటేనే ఆయన కోసం ఎక్కువగా పని చేయొచ్చని నిజామాబాద్ బరిలో దిగా. కాశ్మీర్ దేశంలో అంతర్భాగం. కానీ అప్పటి పెద్ద నాయకులు స్వార్థంతో, మూర్ఖంగా 35ఏ, 370 తీసుకొచ్చారు. ఆర్టికల్ 370ని తొలగిస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. ఆ బిల్లుకు ఓటేసే అవకాశమొస్తే నా జన్మ సార్థకమైనట్టే. నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్ను దేశవ్యాప్తంగా పెట్టాలి. రామ మందిరం అయోధ్యలోనే కట్టాలి. వీటన్నింటికీ ఆమోదమొస్తే నాకు చాలా సంతోషం
మీది హార్డ్కోర్ హిందుత్వ స్టాండా?
హార్డ్కోర్ హిందుత్వవాదినే. కానీ అదంతా జాతీయభావం. అది లేనోళ్లు దేశంలో ఎందుకుండాలి?
రాష్ట్రంలో బీజేపీ రావాలంటే హిందుత్వమే మంత్రమా?
ఉజ్వల, ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్, పంటబీమా వంటి మంచి పథకాలు కనిపిస్తలేవా? మీడియా మాత్రం టీఆర్పీ రేటింగుల కోసం బీజేపీ హిందూవాదాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లింది.
మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారు?
అప్పుడు టీఆర్ఎస్కు ఓట్లేయకుంటే పెన్షన్లు, కల్యాణలక్ష్మి ఆపేస్తమని ఇంటింటికీ ఫోన్లు చేసి బెదిరించారు. ప్రతిపక్షాలు కూడా అనుకున్నంతగా కొట్లాడలేదు.
ఈ 4 నెలల్లో ఏం మార్పు జరిగింది?
ప్రజలు గుడ్డిగా ఉండరు. స్పష్టమైన వైఖరితో ఉంటారు. 2009లో నిజామాబాద్లో అసెంబ్లీకి కూటమికి, లోక్సభకు కాంగ్రెస్కు ఓటేశారు. ఎవర్ని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్లకు తెలుసు.
మీరు గెలవడానికి ప్రధాన కారణం?
తొలి కారణం మోడీపై ప్రజలకు నమ్మకం పెరగడమే. పైగా 21 నెలలు ప్రచారం చేశా. కార్యకర్తల కృషితోనే గెలుపు సాధ్యమైంది. యువత సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నా కోసం ప్రచారం చేశారు. నేను చాలా గ్రామాలకు పోకున్నా విపరీతమైన మెజార్టీ వచ్చింది. ఎన్నారైలూ వచ్చి ప్రచారం చేసి ఓటేశారు.
రైతులల నామినేషన్ల వెనక బీజేపీ ఉందని…?
ముఖ్యమంత్రి ఫాంహౌజ్లో ఉంటే ఏం తెలుస్తాయండి. గ్రామాల్లో తిరిగితే తెలుస్తది. నిజామాబాద్లో పోటీ చేసిన రైతులు గ్రామ కమిటీల ద్వారా డబ్బులు పోగు చేసి నామినేషన్లు వేశారు. విత్డ్రా చేసుకుంటే ఫైన్ కూడా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నేతలూ! ఫాం హౌజ్ నుంచి సీఎంను బయటకు తీసుకురండి. సెక్రటేరియట్లో కూర్చోబెట్టండి.
వారణాసిలో వేసిన నామినేషన్ల సంగతేంటి?
వేసినోళ్లంతా టీఆర్ఎస్ వాళ్లే. నిజామాబాద్లో వేసిన వాళ్లలో ఒక్కరు కూడా అక్కడ వేయలే. వాళ్లంతా ఎక్కడ, ఏ పొజిషన్లో టీఆర్ఎస్లో పని చేస్తున్నారో బయటి ప్రపంచానికి చూపించాం.పసుపు బోర్డు ఎట్లా సాధించబోతున్నరని టీఆర్ఎస్ వాళ్లు అడుగుతున్నరు అందరూ కేసీఆర్లా ఉండరు. ఆయన హామీలేమైనయ్? డబుల్ బెడ్రూం ఇళ్లేవి? మూడెకరాల భూమేది? కేజీటూ పీజీ ఉచిత విద్య ఏమైంది? అప్పటి ఎంపీ తెలంగాణ వర్సిటీని షికాగో వర్సిటీలా చేస్తామన్నరు? అయిందా? ఎన్నారై సెల్ ఎటుబోయింది? వాగ్దానాలు ఎట్ల నెరవేర్చుకోవాలో మాకు తెలుసు. హోం మంత్రి రాజ్నాథ్, మేనిఫెస్టో కమిటీ మెంబర్ రామ్మాధవ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో పసుపు బోర్డుపై ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు హామీ ఇచ్చిండ్రు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటదనుకుంటున్నరా?
సహకరించకపోతే ప్రజల్లోకి పోతం. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతాం.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తదా?
తప్పకుండా వస్తది. తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా ఎదుగుతారా?
కాంగ్రెస్ ఎక్కడుంది? ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీల మెజారిటీ చాలా తక్కువ. మేం ఎదుతున్నం. వాళ్లు తరుగుతున్నరు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఇక దక్షిణాన ఫోకస్ పెడ్తం.
ఎంపీగా గెలిచారుగా? తర్వాత ఏంటి? కేంద్ర మంత్రి పదవా? రాష్ట్రంలోనా?
ముందు పార్టీ బలం పెంచుకుంటాం. తర్వాత పదవులు మస్తుగొస్తయి.
రాష్ట్ర నాయకత్వం బాగా పని చేస్తోందా? హైదరాబాద్ దాటి పోతలేదంటున్నరు.
హైదరాబాద్ బయటనే మూడు సీట్లొచ్చాయిగా. లక్ష్మణ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో తొలిసారి నాలుగు సీట్లొచ్చాయి. ఆయన బాగా ప్రచారం చేశారు.
గల్ఫ్ బాధితుల కోసం ఏం చేస్తున్నరు?
గల్ప్ వెళ్లే వాళ్లను మోసం చేస్తున్న దొంగ ఏజెంట్ల పనిబడతాం. ఇలాంటి ఏజెంట్లకు ఇదే నా వార్నింగ్. కాల్ సెంటర్ పెడ్తున్నా. పని కూడా మొదలైంది. నిజామాబాద్ నుంచి గల్ఫ్ వెళ్లే వాళ్లు సర్టిఫికెట్లు, జాబు, జీతం నిజమేనో కాదో కాల్ సెంటర్ ద్వారా స్క్రీనింగ్ చేయించుకోండి.