
వరుస విజయాలను అందుకోవడంతో పాటు ఒక్కో సినిమాకు నటిగా మరో మెట్టు పైకి ఎక్కుతోంది సాయిపల్లవి. తమిళ, తెలుగు భాషల్లో అమరన్, తండేల్ లాంటి లవ్ స్టోరీస్తో ఇటీవల విజయాలు అందుకున్న ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ మూవీ ‘రామాయణ’లో ఆమె సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్ కూడా విడుదలైంది. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్కు జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది సాయిపల్లవి. ‘ఏక్ దిన్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకుడు.
ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ కలిసి నిర్మిస్తున్నారు. 17 ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కొలాబరేషన్లో వస్తోన్న సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో ‘జానే తూ.. యా జానే నా’ చిత్రం వచ్చింది. ఇక ‘ఏక్ దిన్’ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా (నవంబర్ 8న) ‘రామాయణ’ చిత్రం రాబోతోంది. ఇలా సాయిపల్లవి నటించిన రెండు హిందీ చిత్రాల మధ్య ఏడాది గ్యాప్ ఉన్నప్పటికీ ఒకే వారంలో విడుదల కాబోతున్నాయి. మరి సాయిపల్లవికి నవంబర్ నెల కలిసొస్తుందేమో చూడాలి!