
న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్, ఒకప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షాలో మొండితనం ఉన్నా.. నిజాయితీపరుడని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. సమస్యలను సరైన రీతిలో పరిష్కరించాలనే తన సంకల్పం గొప్పదన్నాడు. కొవిడ్–19 టైమ్లో కొన్ని నెలల పాటు క్రీడా కార్యక్రమాలు నిలిచిపోయినా గంగూలీ, జై షా కలిసి బీసీసీఐని అద్భుతంగా నడిపించారు. ‘అన్ని పనులను జై షా తనదైన శైలిలో పూర్తి చేసేవాడు. ఇందులో అత్యుత్తమం ఏంటంటే ఇండియన్ క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. రకరకాల పనులతో ఆకట్టుకున్నాడు.
అతనికి అధికారం, మద్దతు ఉంది. అందుకే షాలో మొండితనం, దృడత్వం ఎక్కువగా కనిపించేది. కానీ భారత క్రికెట్ కోసం అతను ఏదైనా చేస్తాడు’ అని గంగూలీ వెల్లడించాడు. 2022లో దాదా ప్లేస్లో రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించగా, జై షా నవంబర్ 2024 వరకు బోర్డు సెక్రటరీగా పని చేశాడు. ఆ తర్వాత 36 ఏళ్ల వయసులో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతానికి తామిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని గంగూలీ తెలిపాడు.