కేప్టౌన్: ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన సౌత్ ఆఫ్రికాలో ఫోర్త్ వేవ్ ఎంటరైందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మొత్తం తొమ్మిది ప్రావిన్సులుండగా.. ఏడింటిలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని హెల్త్ మినిస్టర్ వో ఫాహ్లా శుక్రవారం తెలిపారు. సాధ్యమైనంత మేరకు మరణాలు జరగకుండా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన మీడియాతో చెప్పారు. క్రిస్మస్ పండుగ రానున్నందుకు పూర్తి లాక్డౌన్ ను అమలు చేయబోమని, దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటామని ఫాహ్లా ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాలో గురువారం ఒకే రోజు 11,500, అంతకుముందు రోజు 8,500 కరోనా కేసులు ఫైల్ అయ్యాయి.
రంగంలోకి డబ్ల్యూహెచ్వో
రోజురోజుకూ సౌత్ ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) ఎక్స్పర్ట్ టీమ్ను శుక్రవారం ఆ దేశానికి పంపించింది. ఒమిక్రాన్కు కేంద్రంగా ఉన్న గౌటెంట్ ప్రావిన్స్ కు వెళ్లిన ఈ టీమ్... వైరస్ వ్యాప్తి, చూపిస్తున్న ప్రభావం, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ చేస్తుందని డబ్ల్యూహెచ్వో అధికారులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్పై ఇప్పటికే తమ బృందం ఒకటి సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తోందని చెప్పారు.