హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి, ఛట్ పండుగల టైంలో సాధారణం కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల్ కృష్ణన్ తెలిపారు. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ముందుజాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసి ప్యాసింజర్లను సమర్థంగా మేనేజ్ చేశామని ఆయన చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదనపు డీఆర్ఎం (ఆపరేషన్లు) ఎ.సంజీవ్ రావు, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిఫాలీతో కలిసి మీడియా సమావేశంలో గోపాల్ కృష్ణన్ మాట్లాడారు.
ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ లో సికింద్రాబాద్ డివిజన్ లో గ్రేడెడ్ క్రౌడ్ మేనేజ్ మెంట్ ప్లాన్ ను అభివృద్ధి చేశామని, ప్రయాణికులు, వాహనాల కదలికలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వాడకం, పీక్ రష్ అవర్ పై సర్వే చేశామని వివరించారు. దీంతో క్రౌడ్ మేనేజ్ మెంట్ లో ఈ సర్వే ఉపయోగపడిందన్నారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సగటున 1.34 లక్షల మంది ప్రయాణిస్తారని, ఈ పండుగల టైంలో 1.84 లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు.
