ఛత్తీస్ గఢ్ లో కొరియా కంపెనీ టెస్టింగ్ కిట్స్ తయారీ

ఛత్తీస్ గఢ్ లో కొరియా కంపెనీ టెస్టింగ్ కిట్స్ తయారీ

ప్రతి వారం 5 లక్షల కిట్స్ రూపొందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను తయారు చేస్తామని ఎస్డీ బయోసెన్సార్ అనే సౌత్ కొరియాకుచెందిన ఓ బయో డయాగ్నోస్టిక్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు హర్యానాలోని మనేసర్ లో కిట్లను రూపొందిస్తామని కంపెనీ తెలిపింది. మన దేశంలోని కరోనా హాట్ స్పాట్స్ లో టెస్టింగ్స్ కోసం వాడుతున్న చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ నాణ్యతపై మూడు రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. దీంతో దేశీయంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ రూపొందిస్తే బాగుంటుందని పలువురు సూచించారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను కొరియన్ కంపెనీతో తయారు చేయించాలని నిర్ణయించామని ఛత్తీస్ గఢ్ మంత్రి టీఎస్ సింగ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి బయో సెన్సార్ కంపెనీ వరుస ట్వీట్లు చేసింది. తాము 75 వేల క్వాలిటీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను రూపొందించనున్నామని ఒక ట్వీట్ లో పేర్కొంది. రూ.337తోపాటు జీఎస్టీ కలిపి అత్యంత చవకగా వీటిని అందించనున్నామని వివరించింది. ప్రతి వారం 5 లక్షల ర్యాపిడ్ కిట్స్ తయారీ టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపింది. డిమాండ్ ను బట్టి తయారీ సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది.