ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్పురి లోక్ సభ ఉపఎన్నిక ఫలితాల్లో ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఎస్పీ దివంగత నేత, సమాజ్ వారీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ మరణం అనంతరం మెయిన్పురి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎస్పీకి కంచుకోటగా ఉన్న మైన్ పురిలో డింపుల్ విజయం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నారు.
ఇక రామ్పూర్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్పి అభ్యర్థి అసిమ్ రాజా ఆధిక్యంలో ఉన్నారు. ఖతౌలీ స్థానంలో ఎస్పి మిత్రపక్షమైన ఆర్ఎల్డి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్ఎల్డి అభ్యర్థి మదన్ భయ్యా ముందంజలో ఉండగా.. బిజెపి అభ్యర్థి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మండి ఆధిక్యంలో ఉన్నారు. బీహార్లోని కుర్హానీ అసెంబ్లీ స్థానంలో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి మనోజ్సింగ్ కుష్వాహా ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్లోని సర్దార్షహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశాలోని పదంపూర్లో బిజు జనతా దళ్ అభ్యర్థి బర్శా సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

