తాడ్వాయి, వెలుగు: మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులతో కలిసి వెంగలాపూర్ నుంచి మొదలుకొని బయ్యక్కపేట వరకు, మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను పరిశీలించారు.
ఆయా ప్రదేశాల్లో చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష చేస్తూ మేడారం మహా జాతర బందోబస్తు కోసం వచ్చే అధికారులు, సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వసతులు ఏర్పాట్లు చేయాలని, తద్వారా వారు కూడా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని తెలిపారు. జాతర ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అధికారులతో కలిసి ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న రోడ్డు పనులను, గుడిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్, పసర సీఐ దయాకర్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
