నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్​

నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్​
  • రూ. 20 లక్షలు నగదు, పేలుడు పదార్థాలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్​

భద్రాచలం, వెలుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కొరియర్లను అరెస్టు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్​ పేర్కొన్నారు. భద్రాచలంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. గౌరారం గ్రామ సరిహద్దు ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​ సిబ్బంది, పోలీసులు కలిసి తనిఖీలు చేస్తుండగా పైడిగూడెం వైపు నుంచి పెద్ద నల్లబల్లి సెంటర్​ వైపు వస్తున్న కారును ఆపకుండా వెళ్లారు.  

అనుమానంతో వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఉన్నవారు మావోయిస్ట్​ పార్టీ కొరియర్లుగా గుర్తించామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఆంధ్రప్రదేశ్​రాష్ట్రానికి చెందిన కుంజ రఘువరన్, పులిపాటి రవితేజ, ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రానికి చెందిన బైరెడ్డి సతీశ్​, ఉబ్బనపల్లి దినేష్​ కుమార్​ ఉన్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ. 20లక్షల నగదు, జిలెటెన్​ స్టిక్స్​, కార్డెక్స్​వైర్, డిటోనేటర్, రెండు రౌండ్స్​ బుల్లెట్స్​తో పాటు కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ​ 

ఈ నలుగురు కొరియర్లు ఛత్తీస్​ఘడ్ లో మావోయిస్టు నేతలను కలిసి వచ్చారన్నారు.  పోలీసులపై దాడులు చేసేందుకు అవసరమైన పేలుడు పదార్థాలు తీసుకొచ్చేందుకు  కొరియర్లకు మావోయిస్టు నేతలు డబ్బులిచ్చారన్నారు.   ఓఎస్డీ  సాయి మనోహర్​, భద్రాచలం ఏఎస్పీ పంకజ్​పరితోశ్​, దుమ్ముగూడెం సీఐ రమేశ్, ఎస్సై కేశవ్​,  సీఆర్పీఎఫ్​ అధికారులు ప్రీతా, ఆర్​కే చౌరాసియా పాల్గొన్నారు.