
వికారాబాద్, వెలుగు: యుపీఏ ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన అటవీ చట్టం వల్ల గిరిజనులు ఎంతగానో లబ్ధి పొందారని, లక్షలాది మందికి భూములపై పట్టాలు వచ్చాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్లో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. రిజర్వేషన్లు, భూ సంస్కరణల ద్వారా గిరిజనులకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు.
ఈ ఏడాది బడ్జెట్లో గిరిజనుల కోసం 17,167 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బురియా, ఆదివాసి కాంగ్రెస్ కన్వీనర్ రాహుల్ బల్ జి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్కిషన్ నాయక్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు చిగుర్లపల్లి రమేష్కుమార్, ముక్తార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.