గవర్నర్ తమిళిసైపై పోచారం, గుత్తా ఆగ్రహం

గవర్నర్ తమిళిసైపై పోచారం, గుత్తా ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళి సై తీరుపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని  గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని చెప్పారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచిబుద్ధి కలగాలన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. 

ధనికుల ధనాన్ని పేదలకు పంచిపెడతాం అనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని మహాత్మా గాంధీ అనేవారని చెప్పారు. ప్రభుత్వాలు మారడం కాదు..ప్రజల బతుకులు మారాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ

వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్​కు  ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసినట్లు రాజ్​భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్​ను ఎందుకు నిర్వహించడం లేదని గవర్నర్ లేఖలో ప్రశ్నించారు. 

మరోవైపు.. సమావేశాలకు టైమ్ ​దగ్గర పడుతుండటం, బడ్జెట్​కు గవర్నర్​ ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్వంత్ ధవే వాదనలు వినిపించనున్నారు.