
నారాయణపేట, వెలుగు : ‘వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది.. ఈ విద్య అభ్యసించే అవకాశం రావడం గర్వకారణం, సుశిక్షితులైన డాక్టర్లుగా తయారై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.
చివరగా ఏర్పడిన జిల్లా కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్, ఎంసీహెచ్, హాస్టల్స్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం మెడికల్ సిటీగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఆయనకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకిషన్, కడ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి పూలమొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, ఆఫీసర్లు దేవేందర్, రవీందర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం సింగారం మలుపు వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్బంక్ను పరిశీలించారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలి
ఆఫీసర్లు ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేసి, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు సూచించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యల అప్లికేషన్లను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే పరిష్కారం కావని నిర్ధారణ అయితే వాటిని రిజక్ట్ చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను స్పీడ్గా పూర్తి చేయాలని ఆదేశించారు.