
- మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన బీజాపూర్ పోలీసులు
ఏటూరునాగారం, వెలుగు : తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ను ములుగు జిల్లా ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి నీరజ్గా గుర్తించారు. ఈ మేరకు అక్కడి పోలీసులు మృతుడి అన్న రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజు గురువారం చత్తీస్గఢ్ వెళ్లి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చనిపోయింది తన తమ్ముడు నీరజ్ అని నిర్ధారించడంతో మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో నీరజ్ అలియాస్ రవి డెడ్బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చిన అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఏటూరుకు చెందిన సాధనపల్లి అన్నపూర్ణ వెంకటేశ్వర్లు దంపతుల రెండో కుమారుడైన నీరజ్ ఏటూరునాగారంలో ఇంటర్ వరకు చదివాడు. తర్వాత భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ 2023 సెప్టెంబర్లో మావోయిస్ట్ పార్టీలో చేరాడు. అప్పటినుంచి బెటాలియన్ డాక్టర్ టీం కమాండర్గా, దామోదర్కు రైట్ హ్యాండ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతడిపై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. స్వగ్రామంలో జరిగిన నీరజ్ అంత్యక్రియలకు స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.