
- ఎక్కువ మంది ఉంటే స్పెషల్ సెంటర్
- టెన్త్ ఎగ్జామ్స్పై విద్యాశాఖ కసరత్తు
- పెద్ద జిల్లాలపై స్పెషల్ ఫోకస్
- అదనంగా 2,005 పరీక్షా కేంద్రాలు
- చెక్ చేయకుండానే సెంటర్లోకి స్టూడెంట్లు
టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలు, స్టూడెంట్లు ఎక్కువున్న జిల్లాలపై ఫోకస్ పెట్టారు. కంటెయిన్మెంట్ జోన్ నుంచి వచ్చే స్టూడెంట్లకు ప్రత్యేక రూంలు కేటాయించనున్నారు. అలాంటి స్టూడెంట్లు ఎక్కువగా ఉంటే అవసరానికి తగ్గట్టు ప్రత్యేకంగా సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, కరోనా లాక్డౌన్తో మార్చి 23 నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ రూల్స్ సడలించడంతో హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా 5,34,903 మంది పరీక్షలు రాయనున్నారు. మిగిలిపోయిన 8 పరీక్షల కోసం ప్రస్తుతమున్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకూ చర్యలు మొదలుపెట్టారు. పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలను టీచర్ల ద్వారా వివరిస్తున్నారు.
6 జిల్లాల్లోనే 2.42లక్షల విద్యార్థులు..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, నల్గొండ వంటి 6 జిల్లాల్లోనే 2,42,006 మంది స్టూడెంట్లు పరీక్షలకు హాజరవుతారని హైకోర్టుకు ఈమధ్య విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాల్లో ఇంతకుముందు 1,109 పరీక్షా కేంద్రాలుంటే, మరో 998 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. స్టూడెంట్స్ను దూరంగా కూర్చోబెట్టాలని డీఈవోలకు ఇప్పటికే ఆదేశాలూ ఇచ్చారు. కుమ్రంభీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, సిరిసిల్ల, జనగామ, జోగులాంబ గద్వాల, వనపర్తి, ములుగు, నారాయణపేట తదితర 11 జిల్లాల్లో పదివేల లోపు స్టూడెంట్స్ఉన్నారు. ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో స్టూడెంట్ల పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కరోనా భయంతో ఈసారి స్టూడెంట్లను చెక్ చేయకుండానే లోపలికి పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్న రూల్తోనే నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఫిజికల్ డిస్టెన్స్ కోసం ఎక్కువ సెంటర్లు
కరోనా మరింత మందికి వ్యాపించకుండా హైకోర్టు ఆదేశాలతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. హోం క్వారంటైన్, కంటెయిన్మెంట్ జోన్లలోని స్టూడెంట్లకు స్పెషల్ రూంలు ఏర్పాటు చేస్తాం. ఎక్కువమంది ఉంటే అవసరమైతే అదే ఏరియాలో వేరే సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఫిజికల్ డిస్టెన్స్ కోసం సెంటర్లను పెంచాం. కొత్త సెంటర్లన్నీ ప్రస్తుతమున్న కేంద్రాలకు కిలోమీటర్ దూరంలోపే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సత్యనారాయణరెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్
ప్రైవేట్ టీచర్లకు జీతాలిప్పించాలే