- గత సర్కారులోని ప్రముఖ నేతలను త్వరలోనే విచారించనున్న స్పెషల్ టీమ్
- ఎన్నికల సమయంలో ఫోన్ట్యాపింగ్తో టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ సెర్చ్ ఆపరేషన్స్
- ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల డబ్బులు పట్టివేత
- రూ.వందల కోట్లు పట్టుకొంటే అందులో బయటపెట్టింది కొంతే
- ఎలక్షన్స్ కోసం భారీగా క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసిన టాస్క్ఫోర్స్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీమ్ పోలీసులు దూకుడు పెంచారు.ఈ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల కన్ఫెషన్, కస్టడీ రిపోర్ట్ ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రముఖ లీడర్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దర్యాప్తులో ఇప్పటికే సేకరించిన నిందితుల కాల్డేటా, వాట్సాప్ చాటింగ్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీలకు చెందిన బాధితులు అందించిన సమాచారం ఆధారంగా సంబంధిత లీడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రణీత్రావు, సిటీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్స్ కీలకంగా మారినట్టు తెలిసింది.అధికార పార్టీకి చెందిన పలువురు లీడర్స్ చెప్పిన విధంగా ఆపరేషన్స్ చేసినట్టు పోలీసు దర్యాప్తులో వీరిద్దరు వెల్లడించినట్టు సమాచారం.
పెద్దల నుంచి లాగర్ రూమ్కు ఆదేశాలు
ఎస్ఐబీ లాగర్రూమ్ నుంచి డీఎస్పీ ప్రణీత్రావు అందించిన ఫోన్ నంబర్స్, వాయిస్ రికార్డింగ్స్ ఆధారంగా గత ఎలక్షన్స్ సమయంలో రాధాకిషన్ రావు టీమ్ స్పెషల్ ఆపరేషన్స్ చేసిన సంగతి ఇప్పటికే వెల్లడైంది. ఇందులో అధికార పార్టీ మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు, నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉన్న కీలక నాయకుల డబ్బులను పట్టుకున్నారు. కంపెనీల అవసరాల కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బులను కూడా సీజ్ చేశారు. ముఖ్యనాయకుల అనుచరులు, ఆర్థిక వ్యవహరాలు చూసే సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. డబ్బుతో ప్రయాణించే వారి వివరాలతో నిఘా పెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్లో పట్టుకుని సీజ్ చేశారు. ఇలా స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంతమాత్రమే లెక్కలు చూపేవారని ఆరోపణలు ఉన్నాయి.
బ్లాక్మెయిల్తో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు!
పార్టీ ఫండ్, క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకే ఎస్ఐబీ,టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులను వాడుకున్నారని పోలీస్ దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్మెయిలింగ్తో బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా రూ.వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని స్పెషల్ టీమ్ గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు నిందితులు తెలిపిన వివరాలతో బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందుకుగాను ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరిందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్న స్టేట్మెంట్స్ ఆధారంగా సంబంధిత లీడర్లకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.
హవాలా డబ్బు ఎవరికి చేరింది?
మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్రావు టీమ్ ఆపరేషన్స్ ప్రారంభించింది. గత ప్రభుత్వ పెద్దలు అందించిన ఫోన్ నంబర్స్ను ట్యాప్ చేసి, టాస్క్ఫోర్స్ పోలీసులకు అందించింది. దీంతో రాధాకిషన్ రావు టీమ్ ప్రతిపక్షపార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నారు. దీంతోపాటు హవాలా డబ్బును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే, తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు చేతులు మారినట్టు సమాచారం. చాలా మంది హవాలా వ్యాపారులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారులు అడిగినంత అప్పగించారని స్పెషల్ టీమ్ దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను స్పెషల్ టీమ్ పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం.