సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భక్తుల రద్దీనిదృష్టిలో ఉంచుకుని ఈనెల 14, 15వ తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే స్పందించి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.  

ఈనెల 14న శుక్రవారం రాత్రి 8గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ఈ ప్రత్యేక రైలు (07485) శనివారం ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.అలాగే తిరుపతిలో ఈనెల 15న అనగా శనివారం రాత్రి 7.50 గంటలకు బయలుదేరే రైలు (07486) మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు మార్గం మధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుమల శ్రీవారి భక్తులతోపాటు ఇతర ప్రయాణికులు కూడా ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.