డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణ స్పీడప్ చేయాలని ఈసీ మెంబర్లు నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ 60వ ఈసీ మీటింగ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో జరిగింది. వర్సిటీ వ్యవహారాలపై ప్రభుత్వం నుంచి యాక్షన్ స్టార్ట్ అయ్యిందని, దీన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. వీసీ రవీందర్ గుప్తా డైలీ వేజెస్ కింద నియమించిన వారికి రూ.28,22,677 చెల్లించారని తేల్చారు.
ఈసీ పర్మిషన్ లేనందున ఆ మొత్తం దుర్వినియోగం కిందకే వస్తుందని తీర్మానించారు. వీసీకి రిజిస్ట్రార్ ను నియమించే అధికారం లేదని త్వరలోనే గవర్నర్ను కలిసి యూనివర్సిటీలో పరిస్థితి వివరించాలని నిర్ణయించారు. ఈ నెల 17న మరోసారి సమావేశం కానున్నారు. తన పర్మిషన్ లేకుండా ఈసీ మీటింగ్కు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఇంటర్నల్ ఈసీ మెంబర్లు సమావేశానికి వెళ్తే సర్వీస్ రద్దు చేస్తామని వీసీ రవీందర్ గుప్తా చేసిన హెచ్చరికలను సభ్యులెవరూ పట్టించుకోలేదు.