హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లో స్పోర్ట్స్ కోటా రద్దు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన కేసులో జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ల బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ కోటా రద్దు చేస్తూ ఇచ్చిన జీవోలను కొట్టివేసింది.
రెండు వారాల్లోగా పిటిషనర్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని, వాటిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు వాదనలు విన్నది. నిబంధనల మేరకు 2017లో ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లో 0.5 శాతం ప్రత్యేక కోటా కల్పిస్తూ జీవో తెచ్చిందని, రూల్స్ మార్చకుండానే ఆ కోటాను రద్దు చేసిందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. దీంతో కౌన్సెలింగ్లో స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.