
అబుదాబి: శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగె.. ఆసియా కప్ మధ్య నుంచే స్వదేశానికి తిరిగి వెళ్లాడు. దునిత్ తండ్రి సురంగ (54) గుండెపోటుతో గురువారం రాత్రి ఆకస్మికంగా మరణించడంతో.. క్రికెటర్ ఉన్న ఫళంగా కొలంబోకు పయనమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విషయం తెలియడంతో అందుబాటులో ఉన్న విమానంలో స్వదేశానికి బయలుదేరి వచ్చాడు.
అయితే ఆసియా కప్ సూపర్–4లో శ్రీలంక ఆడే తర్వాతి మ్యాచ్లకు వెల్లలాగె అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నెల 23న పాకిస్తాన్, 26న ఇండియాతో లంక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ‘దునిత్ తండ్రి మరణం చాలా బాధాకరం. అతని కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం మీకు అండగా ఉంటుంది’ అని లంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ ఎక్స్లో పోస్ట్ చేశాడు. లంక క్రికెటర్లతో పాటు హెడ్ కోచ్ సనత్ జయసూర్య దునిత్ తండ్రి మరణానికి నివాళి ఆర్పించారు.