
కొలంబో: విమెన్స్ వరల్డ్ కప్లో రెండో విజయం సాధించాలని ఆశించిన శ్రీలంకపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. కొలంబో వేదికగా మంగళవారం శ్రీలంక, న్యూజిలాండ్- మధ్య జరిగిన పోరులో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 258/6 స్కోరు చేసింది. నీలాక్షిక డి సిల్వా (55 నాటౌట్), కెప్టెన్ చమరి ఆటపట్టు (53) ఫిఫ్టీలతో సత్తా చాటగా.. హాసిని పెరీరా (44), యంగ్ ఓపెనర్ విష్మి గుణరత్నే (42) రాణించారు.
కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ మూడు, బ్రీ లింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, కివీస్ ఛేజింగ్ ఆరంభానికి ముందే భారీ వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.