
- పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్'కు కొత్త నిర్వచనమని వెల్లడి
అయోధ్య: యూపీలో అయోధ్య బాల రాముడి ఆలయంలో గురువారం రెండో దశ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 'రాజా రామ్ (రాజు రూపంలో ఉన్న శ్రీ రాముడు)' విగ్రహంతో పాటు కొత్తగా నిర్మించిన ఎనిమిది ఉప ఆలయాల్లో విగ్రహాలకు అభిజిత్ ముహూర్తంలో ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉదయం 6:30 గంటలకు యజ్ఞ మండపం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభం కాగా..ఉదయం 9 గంటలకు ఒక గంట పాటు హోమం చేశారు.
మొత్తం 101 మంది వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం కెమెరాలు, పెద్ద స్క్రీన్ వంటి విజువల్ టెక్నాలజీ సాయంతో ఏకకాలంలో పలు ఆచారాలు నిర్వహించారు. ప్రతిష్ఠాపన చేసిన వాటిలో శ్రీ రామ దర్బార్, శేషావతార్, శివుడు, గణేశుడు, హనుమాన్, సూర్య దేవుడు, భగవతి దేవి విగ్రహాలున్నాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిరంలో ప్రార్థనలు చేసి.. మొదటి అంతస్తులో రామ దర్బార్ దర్శనం చేసుకున్నారు. సమీపంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. "ఇవాళ అయోధ్య ధామ్లో శ్రీ రామ జన్మభూమి మందిరంలోని మొదటి అంతస్తులో శ్రీ రామ దర్బార్తో సహా ఎనిమిది ఆలయాల్లో దేవతల ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇది 'ఏక్ భారత్ -–శ్రేష్ఠ భారత్'కు కొత్త నిర్వచనం. శ్రీ రామచంద్రునికి జై!" అని సీఎం యోగి ట్వీట్ చేశారు.
ఇది గర్వించదగ్గ క్షణం: మోదీ
అయోధ్య రామాలయ సముదాయంలో 'రామ దర్బార్'తో పాటు కొత్తగా నిర్మించిన ఎనిమిది ఆలయాలలో విగ్రహాల ప్రతిష్ఠాపనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ..ఇది మరో గర్వించదగ్గ, చారిత్రక క్షణమని అభివర్ణించారు. ఆ ఆలయంలో 2024 జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన తర్వాత జరిగిన మరో ముఖ్య ఘట్టమని వెల్లడించారు. 'రామ దర్బార్' ప్రతిష్ఠాపన అనేది రామ భక్తుల హృదయాలను భక్తి, ఆనందంతో నింపుతుందన్నారు. దేశ ప్రజలకు శ్రీరాముడు సుఖం, ఆరోగ్యం, సమృద్ధి ప్రసాదించాలని తాను ఆకాంక్షిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.