
పెద్దపల్లి జిల్లాకు చెందిన
శ్రీవారి సేవకుడు మృతి
సంతాపం తెలిపిన టీటీడీ చైర్మన్, ఈవో
తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి సేవా సదన్ రెండో అంతస్తు నుంచి కిందపడ్డ శ్రీవారి సేవకుడు మృతి చెందాడు. వారం రోజులుగా స్విమ్స్ లో చికిత్స పొందుతున్నసుమన్ పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కీలవనపర్తికి చెందిన సుమన్ తిరుమలలో శ్రీవారి సేవకుడిగా చేరాడు. ఈ నెల 2న శ్రీవారి సేవా సదన్ రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సుమన్ ను స్విమ్స్కు తరలించారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్విమ్స్కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
వారం రోజులు మృత్యువుతో పోరాడిన సుమన్ మంగళవారం చనిపోయాడు. సుమన్ మృతి పట్ల టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను టీటీడీ చైర్మన్ ఫోన్ లో పరామర్శించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో టీటీడీ చైర్మన్ ఫోన్ లో మాట్లాడి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. టీటీడీ నిబంధనల ప్రకారం సుమన్ కుటుంబానికి సాయం అందిస్తామన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.