మాదాపూర్ పీఎస్​లో .. ఏసీబీ వలలో ఎస్సై, రైటర్

మాదాపూర్ పీఎస్​లో .. ఏసీబీ వలలో ఎస్సై, రైటర్

మాదాపూర్, వెలుగు: రూ.30వేలు లంచం తీసుకుంటూ మాదాపూర్ పీఎస్​లో పనిచేస్తున్న ఎస్సై, రైటర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​బాబు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్​వీకర్​సెక్షన్ కాలనీకి చెందిన లక్షణ్​నాయక్ తన భార్య పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని కూతురికి ఇచ్చాడు. అందులో ఇంటి నిర్మాణం చేపడుతుండగా, సదరు స్థలం మాది అంటూ సుధా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే మాదాపూర్ ఎస్సై రంజిత్.. లక్షణ్​నాయక్ కు ఫోన్​చేసి బెదిరించాడు. కేసు లేకుండా చేస్తానని, తనకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్​చేశాడు. లేకుంటే కుటుంబం మొత్తంపై కేసు బుక్​చేస్తానని భయపెట్టాడు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో మొదట రూ. 50 వేలు, చివరకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్​చేశాడు. 

దీంతో లక్ష్మణ్​ నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం మధ్యాహ్నం ఎస్సై రంజిత్​కు రూ.20వేలు ఇవ్వబోగా, తనకు రూ.30 వేలు ఇస్తేనే తీసుకుంటానని చెప్పాడు. దీంతో లక్షణ్​నాయక్​తన కొడుకు వద్ద మరో రూ.10వేలు తీసుకొని మొత్తం రూ.30వేలను స్టేషన్​రైటర్​విక్రమ్​కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రైటర్​తోపాటు ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.