హైదరాబాద్, వెలుగు: ఈ నెల 2న నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’ని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షకు 38,674 మంది నర్సులు హాజరయ్యారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం, అభ్యర్థులు ఏ సమాధానాన్ని ఎంచుకున్నారో తదితర వివరాలను బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, వివరాలను ఎంటర్ చేసి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. ప్రిలిమినరీ ‘కీ’కి సంబంధించి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా బోర్డు వెబ్సైట్లో తెలపాలని సూచించింది. దీనికి సంబంధించిన వెబ్ లింక్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ‘కీ’ని విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది.

