తిరుమల తిరుపతి కొండపై భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పొందేందుకు.. తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా భక్తులను క్యూలైన్స్లోకి అనుమతించడంతో.. ఒక్కసారిగా అందరూ వచ్చేసరికి తోపులాటకు దారి తీసింది. భక్తులను క్యూలైన్స్లోకి అనుమతించే సమయంలో.. ఘటనా స్ధలం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో తోపులాట జరిగింది.
భక్తులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించే సమయంలో ఫెన్సింగ్లో పడి ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను క్రమబద్దీకరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్యూలైన్స్ నిర్వహణలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.