న్యూఢిల్లీ: మొండి బాకీల వసూలు కోసం స్టేట్ బ్యాంక్ రూ. 820 కోట్లకు పైగా విలువైన 12 నాన్–పెర్ఫామింగ్ అసెట్స్ (ఎన్పీఏ) ఖాతాలను అమ్మడానికి రెడీగా ఉంచింది. ఈ ఖాతాలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్సీలు)/బ్యాంకులు/ ఎన్బీఎఫ్సీలు/ఫైనాన్షియల్ సంస్థలకు అమ్ముతామని ప్రకటించింది. ఈ నెల నుండి ఏప్రిల్ 13 వరకు వీటి అమ్మకం కోసం నోటీసులు జారీ చేసింది. రూ. 396.74 కోట్ల లోన్ బకాయిలు చెల్లించలేకపోయిన టాప్వర్త్ ఉర్జా & మెటల్స్ లిమిటెడ్ ఖాతాను మార్చి 29, 2022న జరిగే ఈ–-వేలంలో అమ్ముతారు. రిజర్వ్ ధరను రూ. 85 కోట్లుగా నిర్ణయించారు. రూ. 186.10 కోట్ల బకాయిలు (రిజర్వ్ ధర రూ. 178.22 కోట్లు) ఉన్న బాలాసోర్ అల్లాయ్స్ ఖాతాను కూడా మార్చి 29న ఈ–-వేలం వేస్తారు. మరునాడు.. అంటే మార్చి 30న బ్యాంక్ రూ.112.05 కోట్ల విలువైన ఆరు ఎన్పీఏ ఖాతాలను ఈ–వేలంలో బ్యాంక్ అమ్మేస్తుంది. వీటిలో అనుపమ్ ఇండస్ట్రీస్ (రూ. 46.38 కోట్లు), క్లచ్ ఆటో (రూ. 26.14 కోట్లు), కింగ్స్టన్ పాప్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 17.15 కోట్లు), సంభవ్ ఎగ్జిమ్ (రూ. 11.39 కోట్లు), విరాజ్ కాట్స్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 8.06 కోట్లు) ఘంటాకర్ణ ఎంటర్ప్రైజ్ (రూ. 2.93 కోట్లు) ఉన్నాయి. వచ్చే నెల13న మిగిలిన నాలుగు ఎన్పిఎ ఖాతాలను వేలం వేస్తారు. వీటి నుంచి రూ. 125.32 కోట్లు రావాల్సి ఉంది. అనామికా కండక్టర్స్ రూ. 102.30 కోట్లు, మాధవ్ కాటన్ జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ రూ. 16.80 కోట్లు , ఓం కైలాష్ కాటన్ రూ. 5.23 కోట్లు, అజంతా ఎల్లోరా ఎస్టేట్స్ రూ. 0.99 కోట్లు బకాయిపడ్డాయని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది.