కస్టమర్లను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఎవరైనా క్యూఆర్ కోడ్ను పంపి డబ్బులు సెండ్ చేయమంటే చేయొద్దని స్టేట్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సలహాయిచ్చింది. క్యూఆర్ కోడ్ను పే చేయడానికి(షాపుల్లోని క్యూఆర్ కోడ్లు) మాత్రమే వాడాలని, డబ్బులు పంపడానికి కాదని తెలిపింది. క్యూఆర్ కోడ్లను షేర్ చేస్తూ డబ్బులు ఎలా కొట్టేస్తున్నారో తెలిపే ఓ వీడియోను ఎస్బీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. కరోనా సంక్షోభం వలన ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. అలానే ఆన్లైన్ పేమెంట్స్ మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లలో ఎక్కువగా క్యూఆర్ కోడ్ల ద్వారానే జరుగుతున్నాయి. దీన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కస్టమర్లకు క్యూఆర్ కోడ్లు పంపి స్కాన్ చేయాలని అడుగుతున్నారు. స్కాన్ చేస్తే డబ్బులు కొట్టేస్తున్నారు. ‘క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులొస్తాయంటారు కాని రావు. స్కాన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ మాత్రమే వస్తుంది. పే చేయడానికి తప్ప ఎవరైనా క్యూఆర్ కోడ్లను పంపితే స్కాన్ చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి’ అని ఎస్బీఐ ట్వీట్
చేసింది.