
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైతు రుణమాఫీయే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం మార్గదర్శకాలను బేస్ చేసుకొనే రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది.
రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ముగిసినందున ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సొంతమైంది. దీనివల్ల హైదరాబాద్లోని ఏపీ ఆస్తులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తి బడ్జెట్ పద్దులపై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.