సీఎం పర్యటనకు జిల్లా ప్రజలు సహకరించాలి : రోహిణి ప్రియదర్శిని

సీఎం పర్యటనకు జిల్లా ప్రజలు సహకరించాలి : రోహిణి ప్రియదర్శిని
  •    మెదక్​ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రజలు పోలీసుశాఖ వారికి సహకరించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.  సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...మెదక్​ జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, బీఆర్ఎస్​పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సెక్టార్ల వారీగా ఇంఛార్జి అధికారులను నియమించి పోలీసు లైజనింగ్ ఆఫీసర్​గా జిల్లా ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. మెదక్​ పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతిలేదని ఎస్పీ చెప్పారు.