- 2014-15లో వడ్డీలు రూ. 5,195 కోట్లు.. ఈ ఏడాది 19 వేల కోట్లు
- దాదాపు నాలుగింతలు పెరిగిన ఇంట్రెస్ట్.. 4.50 లక్షల కోట్లకు చేరిన అప్పులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుండటంతో వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏటా ఇంట్రెస్ట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిదిన్నరేండ్లలో కేవలం వడ్డీలకే లక్ష కోట్ల రూపాయలు సర్కారు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.15 వేల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి కట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులతోనే ఈ పరిస్థితి తయారైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇంతింతై..!
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014–15లో ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వడ్డీ కట్టింది. ఇప్పుడు అది నాలుగింతలకు చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022–23) వడ్డీల భారం రూ. 19 వేల కోట్లకు చేరింది. 2016–17లో రూ.8 వేల కోట్ల వడ్డీలు కడితే.. అదే 2021–22 లో రూ.18,688 కోట్లు చెల్లించింది. రానున్న కాలంలో ఈ మొత్తం మరింత పెరగనుంది.
ఒక్కొక్కరి తలపై అప్పు రూ.లక్ష దాటింది
సర్కార్ తీసుకునే అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతున్నది. ఇప్పటి దాకా ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ అప్పులను కలిపితే రూ. నాలుగున్నర లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై అప్పు రూ.1.28 లక్షలకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ, ఇతర రుణ సంస్థల నుంచి ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లుగా ఉన్నది. ఇవి కాకుండా గ్యారంటీల పేరుతో కొత్త కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న మొత్తం రూ.1.37 లక్షల కోట్లు. ఈ రెండు కలిపితే రూ.4.50 లక్షల కోట్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఇది ఇంకింత పెరగనుంది. రాష్ట్రం వచ్చేనాటికి అప్పు రూ. 70 వేల కోట్లు మాత్రమే.
ప్రతి ఏడాది రాష్ట్ర సర్కార్ కట్టిన
వడ్డీ చెల్లింపులు ఇలా ( రూ.కోట్లలో)
2014-15 5,195
2015-16 6,755
2016-17 7,995
2017-18 10,262
2018-19 11, 892
2019-20 13,642
2020-21 16,010
2021-22 18,688
2022-23 15,050
(ఇప్పటివరకు)మొత్తం 1,05,489