
- ములుగు, వరంగల్, జనగామ జిల్లాలోనూ పర్యటనలు
యాదాద్రి, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. హైదరాబాద్లోని రాజ్ భవన్ నుంచి రోడ్డుమార్గాన కాన్వాయ్లో బయల్దేరి ఉదయం 8 గంటల వరకు ఆయన గుట్టకు చేరుకుంటారు. గర్భగుడిలో నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేస్తారు. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆలయానికి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
దర్శనం తర్వాత గవర్నర్.. ములుగు, వరంగల్, జనగామ జిల్లాల్లోని పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 29న జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాకలోని జైన దేవాలయం, సోమేశ్వరాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్ను సందర్శిస్తారు. అదేరోజు సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా ఆఫీసర్లను, రచయితలు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ అవార్డు గ్రహీతలను కలుస్తారు.
దర్శన వేళల్లో స్వల్ప మార్పు
గవర్నర్ రాక సందర్భంగా ప్రొటోకాల్ పరంగా, ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. టెంపుల్ టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చేశామన్నారు. ప్రతి మంగళవారం కల్పించే స్వామివారి గర్భాలయ దర్శనాల సమయాన్ని ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు బదులు ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు మార్చామని చెప్పారు. బ్రేక్ దర్శనాల సమయాన్ని ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు మార్చినట్లు తెలిపారు. ఈ మార్పులు ఆగస్ట్ 27న మాత్రమే వర్తిస్తాయన్నారు.
నేడు రాష్ట్రానికి నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. బీబీనగర్లోని ఎయిమ్స్ను సందర్శించి మేనేజ్మెంట్తో సమావేశమవుతారు. అనంతరం బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శిస్తారు. సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో ఆఫీసర్లతో ఆయన సమావేశం కానున్నారు.