
- ప్యాకేజీల వారీగా తీసుకురావాలన్న స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేట్స్ను స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. దేవాదుల, కాళేశ్వరం ప్యాకేజీ 16, ఎల్లంపల్లి ప్రాజెక్టుల రివైజ్డ్ అంచనాలను రివైజ్ చేసి, మళ్లీ తీసుకురావాలని స్పష్టం చేసింది. గురువారం ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఎస్ఎల్ఎస్సీ సమావేశం నిర్వహించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంచనాలను రూ.15 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లకు పెంచారు.
ప్యాకేజీల వారీగా కాకుండా.. ప్రాజెక్ట్కు ఓవరాల్గా అంచనా వ్యయాలను సంబంధిత అధికారులు రివైజ్ చేశారు. దీనిపై కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తంగా కాకుండా.. ప్యాకేజీల వారీగా అంచనా వ్యయాలను రివైజ్ చేసి తీసుకురావాలని ఎస్ఎల్ఎస్సీ చైర్మన్ అనిల్ సూచించారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిహారానికి సంబంధించి వచ్చిన రివైజ్డ్ ఎస్టిమేట్స్నూ తిరస్కరించారు. ఓవరాల్గా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని రూ.100 కోట్లు అదనంగా చూపించారు.
దీంతో ఇందులో కూడా ప్యాకేజీల వారీగా డీవియేషన్లతో రివైజ్డ్ ఎస్టిమేట్లు ఇవ్వాలని చైర్మన్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 16లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి చిట్యాల వరకు కాల్వ పనులకు సంబంధించి రూ.40 కోట్ల మేర డ్యూటీని ఎక్కువగా చూపించారు. అది ప్రాక్టికల్గా లేదని, దానికి ఓ జస్టిఫికేషన్ ఇచ్చి మళ్లీ సబ్మిట్ చేయాలని చైర్మన్ అధికారులకు సూచించారు.