
హైదరాబాద్, వెలుగు: రైతు కుటుంబాలకు విద్య, వైద్య రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ల శిక్షణ తరగతుల్లో ‘‘రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి” అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు రైతు సంక్షేమ విభాగం కూడా కలిసి ఉంటుందని, రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో కూడా రైతు సంక్షేమ విభాగాన్ని జోడించాల్సిన ఆవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ నుంచి రైతు సంక్షేమం విభాగాన్ని తొలగించారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోని ప్రభుత్వంలో కూడా వ్యవసాయ శాఖలో రైతు సంక్షేమ విభాగం లేదని, దీనిని వెంటనే జోడించాలని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అని ఉండేదని, ఇదే విధానం పక్క రాష్ట్రంలో కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశానికి అన్నదాత, వెన్నెముక అయిన రైతుల కుటుంబాలకు విద్య, వైద్యం, బస్సు ప్రయాణాలతో పాటు పలు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు.