
- ఐఏఎస్ అర్వింద్ కుమార్, సీఈ బీఎల్ఎన్ రెడ్డిపై
- న్యాయ విచారణ చేయాలని సర్కారుకు సిఫార్సు
- ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ప్రాసిక్యూషన్ ఫైల్ గవర్నర్
- వద్దనే పెండింగ్ అనుమతి వచ్చాక చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడైన సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీరిద్దరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ప్రజాప్రతినిధి కావడంతో ఆయనపై న్యాయవిచారణ అనుమతికి సంబంధించిన ఫైల్ ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్రాసిన లేఖకు ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు.
కేటీఆర్ కేసుపై గవర్నర్ జిష్ణుదేవ్ మౌనం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అర్వింద్కుమార్, ఏ3 హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డిను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 9న విజిలెన్స్ కమిషన్, సీఎస్కు ఏసీబీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేటీఆర్పై న్యాయ విచారణకు అనుమతి కోరుతూ అదే రోజు గవర్నర్కు సీఎస్లేఖ రాయగా, అది పెండింగ్లో ఉంది. కాగా, ఏసీబీ అందించిన రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించింది. వెయ్యికి పైగా డాక్యుమెంట్లు,78 పేజీలతో కూడిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2, ఏ3 నిందితుల ప్రాసిక్యూషన్కు అనుమతిరావడంతో ఏ1గా ఉన్న కేటీఆర్పై గవర్నర్ అనుమతి కోసం ఏసీబీ ఎదురుచూస్తున్నది. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
పక్కా ఆధారాలతో నివేదిక
ఫార్ములా ఈ రేస్ సీజన్ 9,10కి సంబంధించి రూ.58.89 కోట్లు హెచ్ఎండీఏ బోర్డు నిధులు దుర్వినియోగంపై డిసెంబర్19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఆర్గనైజర్ ఏస్ నెక్స్ట్జెన్కు చెందిన కిరణ్రావు, లండన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు సహా మొత్తం10 మందిని నిందితులుగా చేర్చింది. కేటీఆర్, అర్వింద్కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా నిర్వాహకులు ఎఫ్ఈవో, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను నిందితులుగా విచారించింది.
వీరు వెల్లడించిన వివరాలతోపాటు ఏసీబీ సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో క్విడ్ప్రోకో జరిగినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.58.89 కోట్లకు ప్రతిగా బీఆర్ఎస్కు రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినట్లు తేల్చింది. ఈ మొత్తం వ్యవహారానికి కేటీఆరే సూత్రధారి అని, ఆయన ఆ దేశాలను ఐఏఎస్ అర్వింద్కుమార్, బీఎల్ఎన్రెడ్డి అనుసరించారని స్పష్టం చేసింది. మంత్రి హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేటీఆర్ సహా ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ లేఖ రాసింది. 8 నెలల దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లతో కూడిన రిపోర్ట్ను విజిలెన్స్ కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భాగంగానే తాజాగా విజిలెన్స్ కమిషన్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది.