నిజాంపేటలో తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు

నిజాంపేటలో తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు

మేడ్చల్ మల్కాజ్ గిరి: బాచుపల్లి మండలం నిజాంపేటలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. బండారీ లేఅవుట్ కు చెందిన నరేష్ కుమార్, అతని కుమార్తె (5) తో కలిసి వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. నరేష్ కుమార్, చిన్నారికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

గతంలో కూడా ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్కలు లాక్కెళ్ళాయి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు బెడద ఎక్కువ గా ఉందని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.