ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. 5 వందల కుక్కలను చంపించిన్రు..! పాల్వంచ మండలంలో ఐదుగురు సర్పంచ్‎ల నిర్వాకం

ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. 5 వందల కుక్కలను చంపించిన్రు..!  పాల్వంచ మండలంలో ఐదుగురు సర్పంచ్‎ల నిర్వాకం

కామారెడ్డి, వెలుగు: తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్పంచ్​ అభ్యర్థులు  గెలిచాక వాటిని చంపేశారు. విషాహారం ద్వారా ఐదు గ్రామాల్లో సుమారు 500 కుక్కలను చంపించి, గుట్టు చప్పుడు కాకుండా గోతులు తీసి పాతిపెట్టారు. ఓ జంతు సంరక్షకుని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది.

కామారెడ్డి జిల్లా మాచారం మండలంలోని మూడు గ్రామాల్లో జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టగా,  బుధవారం 244 కుక్కల కళేబరాలు బయటడ్డాయి. మరో రెండు గ్రామాల్లో తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానీపేట, ఫరీద్​పేట, పాల్వంచ, వాడి, బండరామేశ్వర్​పల్లి గ్రామాల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. 

ఈ క్రమంలో గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామని ప్రస్తుత సర్పంచులు హామీ ఇచ్చారు.  గెలిచిన తర్వాత కుక్కల నివారణకు ప్రజల నుంచి డిమాండ్​ రావడంతో ఐదుగురు సర్పంచులు కలిసి కుక్కలను చంపేందుకు ప్లాన్​వేశారు. ఇందుకోసం బయట నుంచి కొందరు వ్యక్తులను పిలిపించి ఒప్పందం చేసుకున్నారు. ఈ  నెల 9న ప్లాన్​ప్రకారం రాత్రిపూట వీధుల్లో విషాహారం పెట్టి కుక్కలను చంపించారు. రాత్రికి రాత్రే ఆయా గ్రామ శివారుల్లో పెద్ద గోతులు తీసి కుక్కల కళేబరాలను  పాతిపెట్టారు. 

‘సఫీ’ ప్రతినిధి ఫిర్యాదుతో వెలుగులోకి..

కుక్కలకు విషం పెట్టి చంపించిన విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా  కరీంనగర్ కు చెందిన ‘స్ట్రే అనిమల్​ ఫౌండేషన్​ ఆఫ్ ఇండియా(సఫీ)’ సంస్థ ప్రతినిధి గౌతమ్​చెవిన పడింది. దీంతో ఆయన వెంటనే  భవానీపేట వచ్చి వివరాలు సేకరించారు. కుక్కలకు మందు పెట్టి చంపించారని నిర్ధారించుకున్న తర్వాత భవానీపేట, పాల్వంచ, ఫరీద్​పేట, వాడి, బండరామేశ్వర్​పల్లి సర్పంచ్​లపై ఈ నెల 12న మాచారెడ్డి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంస్థ ప్రతినిధులు, వెటర్నరీ డాక్టర్ల తో కలిసి  జేసీబీ సాయంతో భవానిపేట, ఫరీద్​పేట, పాల్వంచ గ్రామాల శివార్లలో కుక్కలను పాతి పెట్టిన చోట బుధవారం తవ్వకాలు చేపట్టారు. 

మొత్తం 244 కుక్కల కళేబరాలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వాడి, బండరామేశ్వర్​పల్లిలో ఇంకా కళేబరాలు లభించలేదని, పాతిపెట్టిన జాగల కోసం వెతుకుతున్నామని మాచారెడ్డి ఎస్సై అనిల్​కుమార్​ తెలిపారు. 5 గ్రామాల సర్పంచ్​లపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. కాగా, కుక్కలకు మందుపెట్టేందుకు ఎవరిని పిలిపించారు? వారు ఆహారంలో ఏ మందు కలిపారు? అనే వివరాలు దర్యాప్తులోనే తెలుస్తాయని ఎస్​ఐ పేర్కొన్నారు.