జత కట్టిన అర్బన్ మినిస్ట్రీ, స్విగ్గీ
సబ్సిడీతో చిన్న వ్యాపారులకు లోన్లు కూడా ఇచ్చే చాన్స్
మొదట ఐదు సిటీల్లో అమలు
న్యూఢిల్లీ: స్విగ్గీలో ఇక నుంచి మీకు నచ్చిన స్ట్రీట్ ఫుడ్ను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచే కాకుండా… స్ట్రీట్ ఫుడ్ను కూడా అందించనున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. దీని కోసం స్విగ్గీ, అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ జత కట్టాయి. తమ ఈకామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు అతిపెద్ద మార్కెట్ యాక్సస్ను కల్పించనున్నామని స్విగ్గీ పేర్కొంది. తొలుత ఐదు నగరాలకు అంటే అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ఇండోర్, వారణాసిలలో 250 వెండర్లతో ఈ సర్వీసులను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఇతర నగరాలకు కూడా ఈ సర్వీసులను విస్తరించనుంది. పాన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ విషయంలో స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు సాయం చేస్తామని అర్బన్ మినిస్ట్రీ తెలిపింది. టెక్నాలజీ, యాప్ వాడకం, మెనూ డిజిటైజేషన్ విషయంలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పింది. ప్యాకేజింగ్లో ఉన్నత ప్రమాణాలు వాడేలా, హైజీన్ మెయింటైన్ చేసేలా కూడా చేయనున్నామని అర్బన్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భార్ నిధి(పీఎం స్వానిధి) స్కీమ్లో భాగంగా స్విగ్గీతో తాము అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు అర్బన్ మినిస్ట్రీ చెప్పింది. ఈ స్కీమ్ కింద అర్బన్ స్ట్రీట్ వెండర్లకు సబ్సిడీ ఇంటరస్ట్ రేటుతో రూ.10 వేల వరకు లోన్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా లాక్డౌన్తో ఎఫెక్ట్ అయి, జీవనోపాధి కోల్పోయిన వారికి ఈ విధంగా సాయపడనున్నామని పేర్కొంది. ఈ స్కీమ్ను జూన్ 1న ప్రభుత్వం లాంఛ్ చేసింది.