
- ఇంటర్ ఎగ్జామ్ ఫీజు రూ.490
- చెల్లించేందుకు 24 దాకా గడువు
- ఎక్కువ వసూలు చేస్తే కాలేజీలపై చర్యలు: ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్(ఆర్ట్స్) రెగ్యులర్ జనరల్ స్టూడెంట్లకు ఎగ్జామ్ ఫీజు రూ.490గా ఉందని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. సెకండియర్ సైన్స్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్తో కలిపి ఫీజు రూ.690గా ఉందని చెప్పారు. ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ ఫీజుతో కలిసి రూ.690, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు స్టూడెంట్లకు రూ.840 ఉంటుందని చెప్పారు. ఫస్టియర్ ఇంప్రూవ్ మెంట్ కోసం ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఈ ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే.. మేనేజ్మెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 24 దాకా ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.
రీవెరిఫికేషన్ దరఖాస్తుల క్యాన్సిల్కు చాన్స్
ఫస్టియర్ సబ్జెక్టుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కోసం దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్లకు ఆ దరఖాస్తులను క్యాన్సిల్ చేసుకునే అవకాశమిస్తున్నట్టు ఉమర్ జలీల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఈ నెల17వరకు https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి 1 నుంచి కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి వాటికి సంబంధించిన డబ్బులు పొందవచ్చని తెలిపారు. ఫెయిలైన ఫస్టియర్ స్టూడెంట్లకు సంబంధించిన మినిమమ్ పాస్ మార్కుల మెమోలను శుక్రవారం సాయంత్రం నుంచి డౌన్లోడ్ చేస్కోవచ్చన్నారు.