
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున సులావేసిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయింది. సులవేసి ప్రావిన్స్కి ఉత్తరాన 65 కి.మీ దూరంలో ఉన్న గొరొన్టాలోలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రంలో 145 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భారీ భూంకంపంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు రెండో రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భూకంపం ఏర్పడింది. సోమవారం సుమత్రా దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. అంతకుముందు వారం రోజుల క్రితం తనింబర్ ప్రాంతంలోనూ 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. సులవేసిలో 2018లోనూ భూకంపం ఏర్పడింది. సునామీ వల్ల 4,340 మంది మృత్యువాత పడ్డారు.