
ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు మహాధర్నా నిర్వహించారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ABVP, SFI,PDSU,TVV విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం దగ్గరకు చేరుకొని.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
అంతకు ముందే ఇవాళ ఉదయం ఆయా పార్టీల నేతలను ముందుస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు.TJS కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత అంజన్కుమార్ యాదవ్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంటర్ బోర్డు దగ్గర అఖిలపక్షం నేతలు మహాధర్నా పేరుతో ఆందోళన తలపెట్టారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇంటర్ బోర్డును ముట్టడించాలని నిర్ణయించాయి.