టెక్నాలజీ పెరగడం, కరోనా రావడం.. ఈ రెండూ ఎడ్యుకేషన్ సిస్టమ్పై చాలా ఎఫెక్ట్ చూపించాయి. చదువు నేర్చుకునే పద్ధతులను పూర్తిగా మార్చేశాయి. బలపం పట్టి పలకపై రాసే పిల్లలు ఇప్పుడు టచ్ పెన్ పట్టి ట్యాబ్ల మీద అక్షరాలు రాస్తున్నారు. ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు. కంప్యూటర్ స్క్రీన్ మీదనే టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి, ఎలిమెంటరీస్కూల్ స్టూడెంట్ నుంచి సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ల వరకు అందరూ ఎక్కువగా ఈ యాప్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు. ఇదివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు నాలుగైదు న్యూస్ పేపర్లు చదివేవాళ్లు. కానీ.. ఇప్పడు ఒక్క క్లిక్తో అన్ని భాషల పేపర్లు స్క్రీన్ మీదుంటున్నాయి. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ కళ్లముందు ఉంటోంది.
ప్రస్తుతం డిజిటల్ ఇండియా అనే పదాన్ని మనం ప్రతిచోటా వింటున్నాం, ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అయింది. నాలుగ్గోడల మధ్య సాగే ‘టీచింగ్’ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. పెద్ద పెద్ద హాళ్లలో కాంపిటేటివ్ పాఠాలు చెప్పే ట్యూటర్లు ఇప్పుడు కెమెరా ముందు పాఠాలు చెప్తున్నారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు స్క్రీన్ మీదనే ఆన్సర్ ఇస్తున్నారు. ఇదివరకు ప్రైవేట్ స్కూళ్లలో నోట్స్ రాయించేవాళ్లు, లేదంటే ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్స్ పంపి చదువుకోమంటున్నారు. ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికే చాలా డిజిటలైజ్డ్ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా అరచేతిలోకి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
కరోనాతో స్కూళ్లు మూతపడినప్పటి నుంచి పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు అలవాటయ్యాయి. వాటిలో పిల్లలు డౌట్స్ క్లారిఫై చేయడం కష్టమవుతుంది. పైగా టీచర్ ప్రతి స్టూడెంట్ తీరుని గమనించలేకపోవచ్చు. అందువల్ల చదువులో కాస్త వెనుకబడుతున్నారు. అందుకే పిల్లలు ఎక్స్ట్రా టీచింగ్ కోసం ఈ–లెర్నింగ్ యాప్స్ వాడుతున్నారు. వీటిలో ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లను అడగలేని డౌట్స్కి సమాధానాలు వెతుక్కుంటున్నారు. క్లాస్ రూంలో ఆగిపోయిన లెర్నింగ్ ప్రాసెస్ను కంటిన్యూ చేసేందుకు అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. స్టూడెంట్అకడమిక్ సబ్జెక్టులను వర్చువల్ పద్ధతిలో ఈజీగా అర్థం చేసుకునేందుకు ఈ– లెర్నింగ్ యాప్లు కీ రోల్ పోషిస్తున్నాయి. యాప్స్లో సెల్ఫ్ స్టడీ, వీడియో లెసన్స్, టెక్స్ట్బుక్ సొల్యూషన్స్, శాంపిల్ పేపర్స్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్, మాక్టెస్ట్, రివిజన్ నోట్స్ ఇలా తరగతుల వారీగా సేవలు ఉంటాయి. సెకండరీ లెవల్ స్టూడెంట్స్కోసం ఐఐటీ, జేఈఈ, నీట్, సీఏ, సీపీటీ, బీబీఏ, ఎన్డీఏ లాంటి నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు స్పెషల్ కోర్సులు కూడా యాప్స్లో అందుబాటులో ఉన్నాయి.
లాభాలెన్నో...
కరోనా ప్యాండెమిక్తో స్కూళ్లు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ మూతపడటంతో ఈ– లెర్నింగ్ ఒక్కటే దిక్కయింది. ఈ– లెర్నింగ్ యాప్ల ద్వారా టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. సాధారణంగా ఒక స్టూడెంట్ స్కూల్లో ఉన్నంత టైం ఈ– లెర్నింగ్కు కేటాయించరు. దీంతో పాటు స్కూల్ ఫీజుతో పోలిస్తే ఈ– లెర్నింగ్కు ఖర్చు పెట్టే మొత్తం చాలా తక్కువ. ఫ్రీ యాప్లు వాడితే రూపాయి కూడా ఖర్చు ఉండదు. స్కూలుకు వెళ్లడం, రావడం, యూనిఫామ్ ఇబ్బందులు ఉండవు. యాప్ల ద్వారా స్వేచ్ఛగా నేర్చుకోవచ్చు. లెర్నింగ్ టైంలో స్ట్రెస్ ఉండదు. డౌట్ ఉన్న కాన్సెప్ట్ పై సొంతంగా రీసెర్చ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ స్టడీ మంచి అలవాటుగా మారుతుంది.
నష్టాలు కూడా..
ఈ– లెర్నింగ్ వల్ల స్టూడెంట్స్ టైం సేవ్ అవుతుంది. పైగా ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంక నష్టాలేంటి అంటారా? ఈ– లెర్నింగ్కు స్మార్ట్ఫోన్, ట్యాబ్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఏదో ఒకటి కచ్చితంగా ఉండాలి. వీటిని కొనలేని స్థితిలో దేశంలో చాలామంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ కొనడం, వాడడం సామాన్యుడికి తలకు మించిన భారమే. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, కార్మికులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్ కొనడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల భవిష్యత్ కోసం అప్పులు చేసి, ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెయిడ్ యాప్స్ వాడాలంటే వాటి సబ్స్క్రిప్షన్ కోసం డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చే మరో సమస్య.. యాప్స్ ఎలా వాడుకోవాలో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ వాడని స్టూడెంట్స్కి ఇది ఇబ్బంది కలిగించే విషయమే.
నో ఇంటర్నెట్.. నో క్లాసెస్
ఈ – లెర్నింగ్ యాప్స్ వాడాలంటే.. కేవలం స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోదు. స్పీడ్ ఇంటర్నెట్ కూడా ఉండాలి. ఈ– లెర్నింగ్ యాప్స్లో కొన్నిసార్లు లైవ్ క్లాస్లు ఉంటాయి. వాటిని వినాలంటే హెచ్డి వీడియోని స్ట్రీమ్ చేయగలిగేంత స్పీడ్తో ఇంటర్నెట్ రావాలి. లేదంటే టీచర్ బోర్డు మీద రాసే అక్షరాలు సరిగా కనిపించవు. ఇంటర్నెట్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి ప్రాంతాల్లో స్టూడెంట్స్కి ఇబ్బంది ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మండలాల్లో సిగ్నల్ప్రాబ్లమ్తో స్మార్ట్ ఫోన్లు ఉన్న స్టూడెంట్స్ కూడా యాప్స్ వాడలేకపోతున్నారు. చెట్లు, పుట్టలు ఎక్కి సిగ్నల్స్ అందుకొని పాఠాలు వినడం చూస్తున్నాం.
కాపీయింగ్
ఈ -– లెర్నింగ్ యాప్స్లో రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడుతుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి టెస్టులు రాయించాలి. ఎందుకంటే ఎవరూ చూడట్లేదు కదా! అని చాలామంది పిల్లలు కాపీ కొడుతుంటారు. యాప్లో అడిగే ప్రశ్నలను మరో డివైజ్లో సెర్చ్ చేసి, ఆన్సర్స్ ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్లు చదువులో చాలా వెనుకబడిపోతారు. ఈ – లెర్నింగ్లో ఈ ప్రమాదమూ ఉంది. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లెర్నింగ్ యాప్లు.. పిల్లల వాడకం
ఈ– లెర్నింగ్ యాప్లను సెకండరీ స్కూల్ లెవల్ స్టూడెంట్స్ బాగా వాడుతున్నారు. వాళ్లకు సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఫలానా సబ్జెక్ట్.. ఫలానా కాన్సెప్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో యాప్లు వాడి క్లాస్లు వింటున్నారు. అయితే ఎలిమెంటరీ లెవల్ స్టూడెంట్స్ విషయానికొస్తే పరిస్థితి మరోలా ఉంటోంది. ఈ–లెర్నింగ్లో వీళ్లు వెనకబడి ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ వాడటం తెలియని పిల్లలు చాలామంది ఉంటే, వాడటం తెలిసినా.. ఏకాగ్రత, చదవడం ఇష్టం లేని స్టూడెంట్స్, ఇంట్లో పరిస్థితులు సరిగా లేని వాళ్లు వాటిపై శ్రద్ధ పెట్టడం లేదు. యూనిసెఫ్ ర్యాపిడ్ అసెస్మెంట్లోనూ కొన్ని విషయాలు బయటికొచ్చాయి. కరోనాతో బడులు మూతబడి ఏడాది దాటినా.. ఉత్తరప్రదేశ్లోని సగం మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎలాంటి ఈ –లెర్నింగ్ టూల్స్ వాడలేదని తేలింది ఆస్టడీలో. యాప్స్లో తమ పిల్లలు ఏమాత్రం నేర్చుకోవడం లేదని 84 శాతం మంది పేరెంట్స్ చెప్పారు. అయితే సర్కారు స్కూళ్ల పిల్లలతో పోలిస్తే.. ప్రైవేటు బడుల్లో చదివే స్టూడెంట్స్ ఈ– లెర్నింగ్యాప్స్ వాడకం ఎక్కువగా ఉంటోంది.
ఆన్లైన్ క్లాసుల ఎఫెక్ట్తో..
ఈ– లెర్నింగ్ కోసమని పేరెంట్స్ పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తే వాళ్లు దాన్ని ఇతర వ్యాపకాల కోసం వాడుతున్నారు. తెలంగాణతోపాటు ఢిల్లీ, జార్ఘండ్, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో సర్వే చేసిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) విస్తుపోయే విషయాలు బయటపెట్టింది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లల్లో 59 శాతం సోషల్మీడియాలో చాటింగ్ కోసమే ఫోన్ వాడుతున్నారు. తెలంగాణలో 41.30 శాతం పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నారు. అందులో ఫేస్బుక్ 37.8%, ఇన్స్టా 43.5%, వాట్సాప్ 10.8%, స్నాప్చాట్2.3%, ట్విట్టర్ 2.3% మంది పిల్లలు వాడుతున్నారు.
పోస్ట్ కోవిడ్ ఈ – లెర్నింగ్
కరోనా తగ్గి స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా ఈ –లెర్నింగ్ ప్రభావం తప్పక ఉంటుంది. సందర్భాన్ని బట్టి వివిధ సబ్జెక్టుల్లోని కాన్సెప్ట్స్ని సులువుగా, టెక్నికల్గా అర్థం చేయించేందుకు వర్చువల్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు బీబీసీ లెర్నింగ్ ఇంగ్లీష్ యాప్ వాడి ఏడో తరగతి స్టూడెంట్ తనరోజూ వారి ఇంగ్లీష్ క్లాస్లో వచ్చే డౌట్లను టీచర్ను అడగడంతోపాటు యాప్లోనూ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్జీబ్రాలో ప్రాబ్లమ్ అర్థం కాని స్టూడెంట్ మైక్రోసాఫ్ట్ మ్యాథ్స్ సాల్వర్లో రాసి వెంటనే సొల్యూషన్ తెలుసుకోవచ్చు.
పాపులర్ యాప్స్
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్బోర్డులను బట్టి అనేక ఈ లెర్నింగ్ యాప్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. కొన్ని ఫ్రీ కోర్సులు అందిస్తుండగా మరికొన్ని క్లాసుల వారీగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
మెరిట్నేషన్
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ గ్రూప్ నుంచి 2009లో వచ్చిన మొదటి ఈ లెర్నింగ్ యాప్ మెరిట్నేషన్. దీన్ని ఐఐఎం గ్రాడ్యుయేట్లు తయారు చేశారు.
వెబ్ సైట్: www.meritnation.com
మై సీబీఎస్ఈ గైడ్
ఇండియా బెస్ట్ ఈ లెర్నింగ్ యాప్లలో ఇదొకటి. సీబీఎస్ఈ స్టూడెంట్స్కు అవసరమయ్యే అన్ని ఫీచర్లు ఈ యాప్లో ఉన్నాయి. మూడు నుంచి ట్వెల్త్ వరకు మోడల్ పేపర్స్, మాక్ టెస్టులు, వీడియో లెసన్స్, ఎన్సీఈఆర్టీ సొల్యూషన్స్ ఉంటాయి ఇందులో.
వెబ్ సైట్: www.mycbseguide.com
విద్యాకుల్
ట్యూటర్లు స్టూడెంట్స్ మధ్య దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తయారు చేసిందే విద్యాకుల్ యాప్. ఈ యాప్ ద్వారా స్టూడెంట్స్ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. దీనివల్ల టీచింగ్ టైంలో డౌట్స్ క్లారిఫికేషన్ ఈజీ అవుతుంది.
వెబ్ సైట్: www.vidyakul.com
డౌట్నట్
స్పెషల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన యాప్ డౌట్నట్. లెక్కలు చేసేటప్పుడు సరిగా చేయడం రాకపోతే దాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేయొచ్చు స్టూడెంట్స్. కొన్ని సెకన్లలో ఆ ప్రశ్నకు వీడియో రూపంలో ఆన్సర్ వస్తుంది. ఎన్సీఈఆర్టీ 6 నుంచి ట్వెల్త్ వరకు స్టూడెంట్స్కు ప్రత్యేకించి మ్యాథ్స్ సబ్జెక్టుకు ఉపయోగపడే యాప్. ఇందులో వీడియో లెస్సన్స్, టెక్స్ట్బుక్స్, పీడీఎఫ్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అందుబాటులో ఉంటాయి. ఐఐటీ జేఈఈలకు చదువుతున్న స్టూడెంట్స్కు ఇది బెస్ట్ యాప్.
వెబ్ సైట్: www.doubtnut.com
వీటితోపాటు ‘బ్రియాన్లీ, వైట్హ్యాట్, అన్అకాడమీ, ఎక్స్ట్రా మార్క్స్, టీచ్మింట్, వైజ్ ఆన్లైన్, గ్రేడ్ఆప్, అప్గ్రేడ్, మెల్వనో, హోంవర్క్ యాప్, క్యాంప్, టెస్ట్బుక్, వన్ఫిన్, క్లాస్ప్లస్’ లాంటి ఈ– లెర్నింగ్ యాప్లు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.
ఫార్ములియా
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి కాన్సెప్ట్స్, ఫార్ములాలు అందిస్తున్న ఫ్రీ ఈ లెర్నింగ్ యాప్ ఫార్ములియా. ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనుకునే హయ్యర్ సెకండరీ స్టూడెంట్స్కు ఈ యాప్ ఎంతో యూజ్ఫుల్. ఆసక్తి గల స్టూడెంట్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఖాన్ అకాడమీ
స్కూల్ ఎడ్యుకేషన్లో వరల్డ్ క్లాస్ కంటెంట్అందజేస్తున్న పాపులర్ యాప్గా ఖాన్ అకాడమీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో ఉన్న మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, కంప్యూటింగ్, టెస్ట్ ప్రిపరేషన్స్, లైఫ్ స్కిల్స్కు సంబంధించిన కాన్సెప్ట్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇప్పటికే 10 మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్న ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: www.khanacademy.org
బీబీసీ లెర్నింగ్ ఇంగ్లీష్
ఫ్రీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్కు బీబీసీ లెర్నింగ్ ఇంగ్లీష్ యాప్ గొప్ప అవకాశం. ఇందులో రోజువారి ఇంగ్లీష్, బిజినెస్ ఇంగ్లీష్, లెర్న్ విత్ న్యూస్, లెర్న్ విత్ డ్రామా, ప్రొనౌన్సియేషన్, గ్రామర్, ఒకాబులరీ, ఇంగ్లీష్ ఫర్ టీచింగ్, ఏ టు జెడ్ ప్రోగ్రామ్స్ వంటి కేటగిరీలు ఉన్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ టైటిల్ వీడియోలతో ఇంగ్లీష్ వింటూ నేర్చుకోవచ్చు. ఈ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లో ఫ్రీగా ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
మీమో
కంప్యూటింగ్ స్కిల్స్కు సంబంధించిన ఫ్రీ లెర్నింగ్ యాప్ మీమో. ఇందులో పైతాన్, వెబ్ డెవలప్మెంట్, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ కోడ్ లాంగ్వేజేస్ ఉంటాయి. న్యూ ప్రాజెక్టులు, చాలెంజ్ల ద్వారా కోర్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఐదు మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న ఈ యాప్ సాయంతో ఏ కోర్సు నేర్చుకున్నా పర్సనలైజ్డ్ సర్టిఫికెట్ ఇస్తారు.
క్లాస్ సాథి
ప్రాక్టీస్తో లెర్నింగ్ను ఇంప్రూవ్ చేసుకునేందుకు రూపొందించిన ఫ్రీ లెర్నింగ్ యాప్ ఇది. ఇందులో ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి మాక్ టెస్టులు ఉంటాయి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది.
దీక్ష
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఫ్రీ లెర్నింగ్ యాప్ ఇది. ఒకటో క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్కు ఉపయోగపడేలా ఆయా ప్రాంతీయ భాషల్లో చాప్టర్స్ ఉంటాయి. స్టూడెంట్స్కు ఉపయోగపడేందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా వీడియో పాఠాలు, డాక్యుమెంట్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
కహూట్
ఇదో క్విజ్ యాప్. ఇందులో కరెంట్ ఎఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలు ఫ్లిఫ్ కార్డ్స్ రూపంలో వస్తాయి. స్టూడెంట్స్ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునేందుకు బాగుంటుంది.
వర్డ్ అప్
ఇంగ్లీష్ ఒకాబులరీ పెంచుకోవడానికి వర్డ్ అప్ యాప్ పనికొస్తుంది. ఒక పదానికి అర్థం, సమానార్థం, వ్యతిరేకార్థం, దాని వాక్య ప్రయోగం, ఉదాహరణలతో పూర్తి సమాచారం ఉంటుంది. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం పెంచుకోవాలనుకునే స్టూడెంట్స్కు బాగా పనికొచ్చే యాప్ ఇది.
బైజూస్
ప్రస్తుతం మార్కెట్లో లీడింగ్లో ఉన్న బైజూస్ బెంగుళూర్ నుంచి నడుస్తున్న ఆన్లైన్ ట్యుటోరియల్ కంపెనీ. దీన్ని 2011లో స్టార్ట్ చేశారు. థింక్ అండ్ లెర్న్ మోటోతో నడుస్తున్న బైజూస్ను వాడుతున్న స్టూడెంట్స్ సంఖ్య కరోనా కారణంగా 200 శాతం పెరిగింది. బైజూస్ సర్వీసులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా10 కోట్ల మంది స్టూడెంట్స్ వినియోగించుకుంటున్నట్లు అంచనా. ఈ స్టార్టప్ ఇటీవలి కాలంలో పలు సంస్థలను వరుసగా కొంటోంది. 2017లో ‘ట్యూటర్విస్టా, ఎడ్యురైట్’ను, 2019లో ‘ఓస్మో’ను దక్కించుకుంది. 2020లో కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్ఫాం వైట్హ్యాట్ జూనియర్ను 300 మిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఏకంగా ఒక బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను(ఏఈఎస్ఎల్) కొనింది. వీటితోపాటు సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గ్రేట్ లెర్నింగ్’ యాప్ను, అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం ‘ఎపిక్’ను సొంతం చేసుకుంది. గతేడాది ఏప్రిల్ నుంచి బైజూస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్, నాస్పర్స్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి.
వెబ్ సైట్: www.byjus.com
::: కాశెట్టి కరుణాకర్