నిజామాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునేవారు లేక పదేండ్లుగా సమస్యలతో సావాసం చేస్తున్నారు. ఫ్యాకల్టీ పోస్టులను సర్కారు భర్తీ చేయకపోవడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. వసతి సౌకర్యం సైతం సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. ట్రిపుల్ ఐటీ ఉద్యమ తరహాలో టీయూ స్టూడెంట్లు సైతం ఆందోళనకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం శివారులో తెలంగాణ యూనివర్సిటీని ప్రభుత్వం 2006లో రెండు పీజీ కోర్సులతో ప్రారంభించింది. 2009లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి 28 కోర్సులు షురూ చేశారు. ప్రస్తుతం ఆర్ట్స్అండ్ సైన్స్ విభాగాల్లో 30 కోర్సుల్లో 1,750 మంది స్టూడెంట్లు ఇక్కడ చదువుతున్నారు. మొత్తం 30 డిపార్ట్ మెంట్లకు 144 ఫ్యాకల్టీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కేవలం 85 మందిని మాత్రమే నియమించారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో బదిలీలు, ప్రమోషన్లపై వెళ్లగా ప్రస్తుతం 69 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 30 డిపార్ట్మెంట్లలో 19 విభాగాలకు మాత్రమే ఫ్యాకల్టీ పోస్టులు మంజూరు చేశారు. మిగితా 11 విభాగాలకు ఇంకా వంద మంది అవసరం. ఆ పోస్టులు మంజూరు కాకపోవడంతో స్టూడెంట్స్కు విద్యాబోధన సరిగా జరగక సతమతమవుతున్నారు.
హాస్టల్స్లో అసౌకర్యాలు.. నాసిగా ఫుడ్
వర్సిటీలో మొత్తం 1,750 మంది స్టూడెంట్స్ఉండగా వీరిలో 450 మంది అమ్మాయిలు ఉన్నారు. మూడు హాస్టళ్లు ఉండగా రెండు బాయ్స్కు, ఒకటి గర్ల్స్కోసం కేటాయించారు. ప్రధానంగా గర్ల్స్హాస్టల్లోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 324 మంది ఉండాల్సిన చోట 425 మంది ఉంటున్నారు. నీటి సౌకర్యం, టాయిలెట్స్ సరిపడా లేక అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాల్లో ఆలస్యం వల్ల తరగతులకు సరైన వేళల్లో వెళ్లలేకపోతున్నారు. ధరల భారంతో యూనివర్సిటీ మెస్లో ఫుడ్ నాసిగా పెడుతున్నారు. ఒక్కో స్టూడెంట్కు నెలకు ప్రభుత్వం రూ. 1,500 చెల్లిస్తోంది. అయితే ఒక్కొక్కరికి మెస్చార్జీలు రూ. 2,200 అవుతున్నాయి. దీంతో ఫుడ్లో క్వాలిటీ కొరవడుతోందని స్టూడెంట్లు చెబుతున్నారు.
మెరుగైన వసతి కల్పించండి
తెలంగాణ వర్సిటీలో గర్ల్స్కి ఒకే హాస్టల్ఉండడంతో నానా అవస్థలు పడుతున్నం. 324 మంది ఉండాల్సిన చోట 425 మందిని ఉంచారు. ఒక్కో గదిలో 8 మంది ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు. డిస్పెన్సరీ లేక అవస్థలు పడుతున్నాం. ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. మెస్చార్జీలను పెంచకపోవడంతో ధరలు పెరిగి నాసిరకం ఫుడ్అందిస్తున్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
– అరుణ, పీజీ స్టూడెంట్
పోస్టులు వెంటనే భర్తీ చేయాలె
వర్సిటీలో 75 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4 ఏండ్లుగా వర్సిటీలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఖాళీల వల్ల విద్యాబోధన లేక రిజల్ట్స్ పై ఎఫెక్ట్ పడుతోంది. పదేళ్లుగా ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నత విద్యామండలి, వర్సిటీ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. తక్షణమే 75 పోస్టులను భర్తీ చేయాలె.
– వేణురాజ్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రెసిడెంట్, నిజామాబాద్