
వనపర్తి/మునిపల్లి, వెలుగు: వివిధ కారణాలతో వనపర్తి, సంగారెడ్డి జిల్లా తాటిపల్లి కేజీబీవీల్లో స్టూడెంట్లు బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్విద్యార్థిని మంగళవారం బిల్డింగ్ పై నుంచి దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన తరుణి(16) ఆరు రోజుల కింద వనపర్తిలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూపులో చేరింది. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక తనను ఇంటికి తీసుకెళ్లాలని పేరెంట్స్ను కోరింది.
కేజీబీవీ టీచర్లు పలుమార్లు ఆమె పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పగా, వర్షాలు వస్తున్నాయని, తగ్గగానే వస్తామని చెప్పారు. తనను హాస్టల్లోనే ఉంచుతారని భావించిన తరుణి మంగళవారం కేజీబీవీ బిల్డింగ్పై బట్టలు ఆరేసుకునేందుకు ఉన్న వరండాలోకి వెళ్లి, అక్కడి నుంచి కిందకు దూకి పారిపోవాలని యత్నించింది. గాయాలపాలైన ఆమెను ఎస్వో లోహిత, సిబ్బంది 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్పైనల్ కార్డ్కు గాయాలయ్యాయని గుర్తించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సిఫారసు చేశారు.
తాటిపల్లిలో..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి కేజీబీవీ బిల్డింగ్ పై నుంచి విద్యార్థిని దూకగా, ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదాశిపేట మండలం అంకెన్ పల్లి గ్రామానికి చెందిన భవాని తాటిపల్లి కేజీబీవీలో ఈ ఏడాది 9వ తరగతిలో చేరింది. సోమవారం భవనం పైకి ఎక్కి వాటర్ పైపు పట్టుకొని దూకడంతో విద్యార్థినికి గాయాలయ్యాయి. టీచర్లు వెంటనే బంధువులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. విద్యార్థినిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా స్కానింగ్ చేసి మందులు ఇచ్చి పంపించారు. మంగళవారం మరోసారి పరీక్షలు చేసి గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు.