చన్నీళ్లతో స్నానాలు..వణుకుతోన్న విద్యార్థులు

చన్నీళ్లతో  స్నానాలు..వణుకుతోన్న విద్యార్థులు

అసలే చలికాలం. తెల్లవారుజామున నీళ్లలో చేతులు పెట్టాలంటేనే ఒల్లు జల్లుమంటోంది. అన్ని వసతులున్న మనకే బయటకు వెళ్లాలంటే శరీరం గజ గజ వణుకుతోంది. అలాంటిది చిన్న పిల్లలు. అందులోనూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం అంటే ఎలా ఉంటుంది.. ఇంటి దగ్గర్నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. తెల్లవారుజామే లేవాలి... చన్నీళ్లతో స్నానం చేయాలి.. సమయానికి క్లాసుకు హాజరు కావాలి. ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా వెల్గటూర్ లోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే హాస్టల్ లోని విద్యార్థుల పరిస్థితి చూడడానికే దయనీయంగా ఉంది. 

జగిత్యాల జిల్లాలో చలికి హాస్టల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గజ గజ వణికిపోతూ చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నరు.వెల్గటూర్ లోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే హాస్టల్ లోని విద్యార్థులు శీతాకాలంలోనూ చన్నీళ్లతో స్నానం చేస్తూ తల్లడిల్లుతున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి  చలి తీవ్రత మరింత పెరగడంతో వారి బాధలు వర్ణనాతీతం. ఈ క్రమంలో చలికి తట్టుకోలేక.. చెత్తకు, ప్లాస్టిక్ కవర్లతో నిప్పు పెట్టి మంట కాగుతూ కొంత ఉపశమనం పొందుతున్నారు. 

హాస్టల్ పరిసరాల్లో పడేసిన చెత్తా, చెదారాన్ని తీసుకొచ్చి మంట పెట్టుకొని, విద్యార్థులు ఉపశమనం పొందుతున్నారు. ఆ చెత్త పక్కనే మంటను చేసి, అక్కడే గుంపులు గుంపులుగా కూర్చొని.. కాసేపు మంట కాగుతున్నారు. మరికొందరు విద్యార్థులు తినేటప్పుడు కూడా ఎండలో కూర్చొని తింటున్నారు. ఈ దృశ్యాలు చూపరులను కదిలించేవిగా ఉన్నాయి. విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్లు సమకూర్చాలని పలుమార్లు ప్రతిపాదనలు వచ్చినా ఇప్పటికీ ఈ నిర్ణయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులు ప్రతీ చలికాలంలోనూ ఇబ్బందులు పడుతూ.. నానా అవస్థలు పడుతున్నారు.